
బీజేపీ ఎంపీతో కలిసి అమెరికాకు వైసీపీ ఎంపీ మిథున్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మద్యం కుంభకోణంలో ఇటీవల బెయిల్ తెచ్చుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అమెరికాకు వెళ్తున్నారు. బీజేపీ ఎంపీ పురందేశ్వరి నాయకత్వంలో ఐక్యరాజ్య సమితికి వెళ్లే భారత్ పార్లమెంట్ సభ్యుల బృందంలో మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. ఇలా ప్రకటన వచ్చిన వెంటనే అలా మిథున్ రెడ్డి తన పాస్ పోర్టు కోసం కోర్టుకు కూడా వెళ్లారు.
ఐక్యరాజ్య సమాఖ్య జనరల్ అసెంబ్లీకి 80వ సెషన్కు భారత పార్లమెంటరియన్ల డెలిగేషన్ వెళ్లనుంది. అక్టోబర్ 27 నుంచి న్యూయార్క్లో ప్రారంభం కానున్న ఈ సమావేశానికి దేశం తరపున పదహారు మంది ఎంపీలు వెళ్తున్నారు. టీడీపీ నుంచి ఒక్కరు కూడా లేరు. కానీ వైసీపీ నుంచి మిథున్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఏపీ నుంచే బీజేపీ ఎంపీగా ఉన్న పురందేశ్వరి ఈ టీమ్కు నాయకత్వం వహిస్తారు. అందుకే మరో ఎంపీని ఎంపిక చేయలేదని తెలుస్తోంది.
ఈ సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభమవుతాయి. భారత వైపు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సెప్టెంబర్ 27న ప్రసంగిస్తారు. అక్టోబర్ 27 నుంచి జరిగే పార్లమెంటరియన్ల స్పెషల్ డెలిగేషన్ మరో ముఖ్య భాగం. ఇది యూఎన్జీఏ సెషన్లోని పోస్ట్-హైలెవల్ ఈవెంట్స్, సైడ్లైన్ మీటింగ్స్, దౌత్యపరమైన చర్చలకు సంబంధించినది. భారతదేశం తరఫున హాజరయ్యే డెలిగేషన్లో మిథున్ రెడ్డి కూడా ఉంటారు. దీంతో మరోసారి చర్చ మొదలైంది. ఇటీవల బెయిల్పై విడుదలైన మిథున్ రెడ్డి ఇప్పటి వరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవలేదు. దీంతో మిథున్ రెడ్డికి బీజేపీ ప్రాధాన్యమిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది.
