
బాలయ్య వ్యాఖ్యలు వైసీపీకి ప్లస్ !
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ నెత్తిన పాలు పోశారు. ఇన్నాళ్లు వైసీపీ మోస్తున్న బరువును దించేశారు. వైసీపీకి ఊపిరి ఊదారు. ఇదంతా నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా చేసిన కామెంట్స్ పుణ్యమే. లేకుంటే వైసీపీకి ఆ మరక తొలగేది కాదు. దశాబ్ధాలు గడిచినా ఉండేది. కానీ బాలయ్య నోటిదురుసు వైసీపీకి కలిసొచ్చింది. వైసీపీని గట్టెక్కించింది.
సినిమా టికెట్ల రేట్ల పెంపుపై అప్పటి సీఎం జగన్ కలిసేందుకు సినీ బృందం వెళ్లింది. వారిలో చిరంజీవితో సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. జగన్ ను కలిసారు. వచ్చారు. టికెట్ రేట్లు పెంచుకున్నారు. కానీ పవన్ రాజకీయం మొదలెట్టారు. తన అన్నను జగన్ అవమానించారంటూ ఎన్నికల ముందు ప్రతి సభలోనూ దాదాపు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. జగన్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పవన్ వ్యాఖ్యలు మెగా అభిమానుల్లోకి, కాపు సామాజికవర్గంలోకి బలంగా వెళ్లాయి. జగన్ పై కోపాన్ని పెంచాయి. ఫలితంగా కాపు సామాజికవర్గం బలంగా ఉన్న ప్రాంతాల్లో వైసీపీ దారుణంగా నష్టపోయింది.
ఇటీవల అసెంబ్లీ వేదికగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చిరంజీవికి కోపం తెప్పించాయి. వెంటనే పత్రికా ప్రకటన విడుదల చేశారు. తమను జగన్ అవమానించలేదని, గౌరవించారని అందులో పేర్కొన్నారు. చిరంజీవితో పాటు అప్పుడు జగన్ వద్దకు వెళ్లిన ఆర్. నారాయణమూర్తి స్పందించారు. జగన్ తమను అవమానించలేదని స్పష్టత ఇచ్చారు. బాలయ్య వ్యాఖ్యలు టీడీపీ,జనసేన మధ్య మనస్పర్థలకు కారణమయ్యాయి. కానీ వైసీపీకి మాత్రం పాజిటివ్ గా మారాయి. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ..జగన్ తన అన్నను అవమానించాడన్న ప్రచారం అబద్ధమని తేలింది. స్వయంగా చిరంజీవే ప్రకటించాక... పవన్ ఆరోపణలు అవాస్తవమని అర్థమయింది. దీంతో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. వైసీపీకి మంచి జరిగింది. ఇన్నాళ్లు మోస్తున్న ఆరోపణలను బాలయ్య రూపంలో తొలగించారు. వైసీపీకి ఊపిరిలూదారు.
2024 ఎన్నికల ముందు.. చిరంజీవిని జగన్ అవమానించారన్న పవన్ ఆరోపణలను వైసీపీ తిప్పికొట్టలేకపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఆరోజు తిప్పికొట్టి ఉంటే వైసీపీకి కాపు సామాజికవర్గంలో అంత నష్టం ఉండేదికాదన్న అంచనా ఉంది. కానీ వైసీపీ ఆరోజు విఫలమైంది. అందుకే నష్టపోయింది. ఇప్పుడు చిరంజీవి పత్రికా ప్రకటన ద్వార చెప్పాక.. వైసీపీ ఆరోజు ఏం జరిగిందో మరోసారి వివరించే ప్రయత్నం చేసింది. కానీ ఆరోజే ఇంత బలంగా వివరించి ఉంటే ఈ నష్టం ఉండేది కాదన్న వాదన ఉంది. ఏది ఏమైనప్పటికీ బాలయ్య మాటలు, చిరంజీవి క్లారిటీ, వైసీపీకి ప్లస్సయింది.
