
బధిరుల ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ పతకాల వేట
బధిరుల ఒలింపిక్స్ క్రీడల్లో భారతదేశ షూటింగ్ ఈవెంట్ సోమవారం మరింత వార్తల్లోకి వచ్చింది. యువ షూటర్లు అనుయ ప్రసాద్, ప్రాంజలి ప్రశాంత్ ధుమాల్ టోక్యోలో జరిగిన మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శన చేసి మొదటి 1,2 స్థానాలను సాధించారు. అనుయకు ఈ విజయం పుట్టినరోజు కానుకగా రాగా, ప్రాంజలి రజతం సాధించి వేడుకను మరింత పెంచింది.
అనుయ ఫైనల్లో 241.1 స్కోరుతో అద్భుతమైన ప్రదర్శన చేసి, స్వర్ణాన్ని దక్కించుకోవడంతో పాటు కొత్త బధిరుల ఫైనల్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ 19 ఏళ్ల క్రీడాకారిణి క్వాలిఫికేషన్ రౌండ్లో 564 స్కోర్తో మూడో స్థానంలో నిలిచి ఫైనల్కు చేరుకుంది. ఆ తర్వాత, 52.5 పాయింట్లతో బలమైన మొదటి సిరీస్ను నమోదు చేసి, పోటీ అంతటా తన ఆధిక్యాన్ని కొనసాగించి ఆటపై పూర్తి నియంత్రణ సాధించింది. గత సంవత్సరం హానోవర్లో జరిగిన బధిరుల ప్రపంచ ఛాంపియన్షిప్స్లో స్వర్ణం గెలుచుకున్న తర్వాత ఆమెకు ఇది రెండో ప్రధాన అంతర్జాతీయ పతకం.
క్వాలిఫికేషన్లో అద్భుతమైన 572 స్కోర్తో అగ్రస్థానంలో నిలిచిన ప్రాంజలి, క్వాలిఫికేషన్ ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టి, ఫైనల్లో 236.8 స్కోర్తో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఇరాన్కు చెందిన మహ్లా సమీ కాంస్య పతకంతో ముగించింది.
భారతదేశ బలమైన పతకాల పరుగు పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్లో కూడా కొనసాగింది, అభినవ్ దేశ్వాల్ రజత పతకాన్ని సాదించాడు. 2022 డెఫ్లింపిక్స్లో స్వర్ణం గెలుచుకున్న 18 ఏళ్ల అభినవ్, క్వాలిఫికేషన్లో 576 స్కోర్తో ప్రపంచ బధిరుల ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ రికార్డులను సమం చేసిన తర్వాత, ఫైనల్లో 235.2 స్కోర్ చేశాడు. కొరియాకు చెందిన టే యంగ్ కిమ్ 238.2 తో స్వర్ణం గెలుచుకోగా, క్రొయేషియాకు చెందిన బోరిస్ గ్రామ్నియాక్ కాంస్యం సాధించాడు.
ఈ ఫలితాలతో కేవలం రెండు రోజుల పోటీల్లోనే భారతదేశ షూటింగ్ పతకాల సంఖ్య ఏడుకు చేరుకుంది. ధనుష్ శ్రీకాంత్ ఆదివారం 10మీ ఎయిర్ రైఫిల్ స్వర్ణంతో ఈ పతకాల వేట ప్రారంభమైంది, ఇది బధిరుల షూటింగ్ క్రీడలలో భారతదేశ ఆధిపత్యం పెరుగుతున్న విషయాన్ని గుర్తుచేస్తుంది.
మంగళవారం ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ జరగనున్నందున, భారత్ తన పతకాల వేటను మరింత విస్తరించాలని భావిస్తోంది.
బధిరుల ఒలింపిక్స్ అంటే ఏమిటి?
బధిరుల ఒలింపిక్స్ అనేది వినికిడి లోపం ఉన్న అథ్లెట్ల కోసం నిర్వహించే అంతర్జాతీయ బహుళ-క్రీడా ఈవెంట్ ఇందులో వేసవి, శీతాకాలపు క్రీడలు ఉంటాయి.
ఈ క్రీడలలో పాల్గొనే అథ్లెట్లు సాధారణ ఒలింపిక్స్ లేదా పారాలింపిక్స్లో మాదిరిగా శబ్ద సంకేతాలు ఆధారంగా కాకుండా, దృశ్య సంకేతాలు ,సైన్ లాంగ్వేజ్ ఆధారంగా పోటీపడతారు. ఉదాహరణకు, రేసుల ప్రారంభానికి స్టార్టింగ్ పిస్టల్ బదులుగా కాంతి సంకేతాలను ఉపయోగిస్తారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ దీనిని గుర్తించింది.
బధిరుల ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభమైంది?
• మొదటి ఈవెంట్:
• మొదటి ఆధునిక బధిరుల ఒలింపిక్స్ 1924లో ఫ్రాన్స్లోని పారిస్లో ప్రారంభమైంది.
• మొదటి పేరు:
• దీనిని మొదట్లో "ఇంటర్నేషనల్ సైలెంట్ గేమ్స్ “ అని పిలిచేవారు.
• చరిత్ర:
• ఒలింపిక్స్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బహుళ-క్రీడా ఈవెంట్లలో ఇది రెండవది.
ఇప్పటివరకు భారత్కు వచ్చిన పతకాలు
భారతదేశం బధిరుల ఒలింపిక్స్లో తన ప్రయాణాన్ని 1965 లో ప్రారంభించింది.
• బధిరుల ఒలింపిక్స్లో (వేసవి, శీతాకాలపు క్రీడలు కలిపి) భారతదేశం ఇప్పటివరకు 52 పతకాలు గెలుచుకుంది.
• బ్రెజిల్లోని కక్సియాస్ దో సుల్ లో జరిగిన 2021 సమ్మర్ డెఫ్లింపిక్స్ (2022లో జరిగింది) లో భారత్ అత్యుత్తమంగా 16 పతకాలను (8 స్వర్ణాలు, 1 రజతం, 7 కాంస్యాలు) సాధించింది.
ప్రస్తుత* *బధిరుల ఒలింపిక్స్(డెఫ్లింపిక్స్ ) టోక్యో 2025 అప్డేట్:
టోక్యో 2025 బధిరుల ఒలింపిక్స్ (డెఫ్లింపిక్స్) లో మొదటి రెండు రోజుల్లో (నవంబర్ 17 వరకు) భారత షూటింగ్ విభాగంలో మొత్తం 7 పతకాలు వచ్చాయి. (2 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యం).
