
బంగ్లాదేశ్లో హిందూ వ్యక్తిని వాహనంతో తొక్కి చంపి హత్య
బంగ్లాదేశ్లో ఎన్నికల వేళ హిందువులపై దాడులు పెరుగుతున్న తరుణంలో, పెట్రోల్ పంపులో ఇంధనానికి డబ్బులు అడిగిన రిపన్ సాహా అనే హిందూ యువకుడిని నిందితులు కారుతో తొక్కి దారుణంగా హత్య చేశారు. బంగ్లాదేశ్లో పెట్రోల్ పంపులో ఇంధనం నింపుకుని, డబ్బులు చెల్లించకుండా పారిపోవడానికి ప్రయత్నించిన ఒక వాహనాన్ని అడ్డుకున్నందుకు, ఒక హిందూ వ్యక్తిని ఆ వాహనంతో తొక్కి చంపినట్లు పోలీసులు తెలిపారు. రాజ్బారి జిల్లాలో జరిగిన ఈ సంఘటన, బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరుస దాడుల్లో తాజా ఘటనగా నిలిచింది.
ఘటన వివరాలు:
మృతుడిని 30 ఏళ్ల రిపన్ సాహాగా గుర్తించారు. అతను ఒక ఫ్యూయల్ స్టేషన్ కార్మికుడని 'ది డైలీ స్టార్' పత్రిక నివేదించింది. గోలాండా మోర్లోని 'కరీం ఫిల్లింగ్ స్టేషన్'లో అతను పనిచేస్తున్నాడు.
రాజ్బారి సదర్ పోలీస్ చీఫ్ ఖొందకర్ జియౌర్ రెహమాన్ మాట్లాడుతూ... "మేము దీనిని హత్య కేసుగా నమోదు చేస్తాము. ఇంధనానికి డబ్బు చెల్లించడానికి నిరాకరించినప్పుడు, ఆ కార్మికుడు కారుకు అడ్డంగా నిలబడ్డాడు. వారు అతనిపై నుండి కారును పోనిచ్చి, అక్కడి నుండి పారిపోయారు," అని తెలిపారు.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఒక నల్లటి ఎస్యువి వాహనంలో పెట్రోల్ పంపుకు వచ్చిన వారు సుమారు 5,000 టాకాలు (సుమారు రూ. 3,710) విలువైన ఇంధనాన్ని కొట్టించుకున్నారు. డ్రైవర్ డబ్బు చెల్లించకుండా వెళ్లడానికి ప్రయత్నించగా, సాహా అడ్డుకున్నాడు. కారు అతనిపై నుండి దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.
పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, దాని యజమాని అబుల్ హషీమ్ (సుజన్) మరియు డ్రైవర్ కమల్ హొస్సేన్లను అరెస్టు చేశారు. హషీమ్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మాజీ కోశాధికారి అని సమాచారం.
బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి, ఇటీవలి హింసాకాండ
2022 జనాభా గణన ప్రకారం, బంగ్లాదేశ్లో హిందూ జనాభా సుమారు 13.13 మిలియన్లు (1.31 కోట్లు), ఇది మొత్తం జనాభాలో 7.95%.
ఫిబ్రవరి 12న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయని 'బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్' ఆందోళన వ్యక్తం చేసింది. డిసెంబర్ 2025 నెలలోనే 51 మతపరమైన హింసాత్మక ఘటనలు నమోదయ్యాయని వారు తెలిపారు.
ఇటీవలి కొన్ని ప్రధాన ఘటనలు హిందువులపై దాడిని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా, డిసెంబర్ 2న నర్సింగ్డిలో జ్యువెలర్ ప్రంతోష్ సర్కార్ ను కాల్చి చంపగా. డిసెంబర్ 18 న మైమెన్సింగ్లో దైవదూషణ ఆరోపణలతో దీపు చంద్ర దాస్ అనే యువకుడిని గుంపుగా కొట్టి చంపి, నిప్పు పెట్టారు. డిసెంబర్ 31న ఖోకాన్ చంద్ర దాస్ అనే వ్యక్తిపై దాడి చేసి, నిప్పు పెట్టారు. అతను జనవరి 3న మరణించాడు. జనవరి 5న గ్రోసరీ షాపు యజమాని మోని చక్రవర్తి, వార్తాపత్రిక ఎడిటర్ రాణా ప్రతాప్ బైరాగి హత్య. డిసెంబర్ 7న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు జోగేష్ చంద్ర రాయ్, అతని భార్య శుభర్ణ రాయ్లను రంగపూర్లో దారుణంగా హత్య చేశారు. మైనారిటీ ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయకుండా అడ్డుకోవడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమని ఫోరం ఆరోపించింది.
