Let's talk: editor@tmv.in
బంగ్లాదేశ్‌లో మరోసారి చెలరేగిన హింస

బంగ్లాదేశ్‌లో మరోసారి చెలరేగిన హింస

Shaik Mohammad Shaffee
20 డిసెంబర్, 2025

బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది జరిగిన జులై తిరుగుబాటులో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది చనిపోవడంతో బంగ్లాదేశ్‌లో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఆయన మరణవార్త విని కొందరు ఆందోళనకారులు కోపంతో దాడులు, విధ్వంసాలకు దిగుతుండటంతో దేశంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రజలకు ఒక విజ్ఞప్తి చేసింది. కేవలం కొద్దిమంది మాత్రమే కావాలని అల్లర్లు సృష్టిస్తున్నారని, అలాంటి వారి మాటలు నమ్మి హింసకు పాల్పడవద్దని కోరింది. ప్రజలందరూ శాంతిని కాపాడి, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

సింగపూర్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసిన నాయకుడు హాది పార్థివ దేహం శుక్రవారం సాయంత్రం ఢాకా విమానాశ్రయానికి చేరుకుంది. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే గురువారం రాత్రి నుంచే బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు పలుచోట్ల దాడులు, ఆస్తుల ధ్వంసానికి దిగారు. చిట్టగాంగ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషనర్ నివాసంపై కూడా కొందరు రాళ్లతో దాడి చేశారు. అయితే, శుక్రవారం ఉదయం నుంచి పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చిందని, కొత్తగా ఎక్కడా గొడవలు జరిగినట్లు సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు.

గతేడాది విద్యార్థులు చేపట్టిన 'జూలై ఉద్యమం'లో హాది కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న జరగబోయే సాధారణ ఎన్నికల్లో ఆయన అభ్యర్థిగా కూడా పోటీ చేయాల్సి ఉంది. అయితే గత వారం ఢాకాలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. తలలో బుల్లెట్ దిగడంతో పరిస్థితి విషమించి, మెరుగైన చికిత్స కోసం ఆయన్ని సింగపూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చావుబతుకుల మధ్య ఆరు రోజుల పాటు పోరాడిన హాది, చివరకు చికిత్స పొందుతూ కన్నుమూశారు.

'ఇంక్విలాబ్ మంచా' సంస్థ ప్రతినిధి అయిన హాది భౌతికకాయం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు విమానంలో ఢాకా విమానాశ్రయానికి చేరుకుంది. ఆయన మరణంతో దేశంలో ఉద్రిక్తతలు ఉన్నందున, ప్రభుత్వం విమానాశ్రయం దగ్గర అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. హాది పార్థివ దేహాన్ని విమానాశ్రయం నుండి బయటకు తీసుకువచ్చే సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా బంగ్లాదేశ్ ఆర్మీ, సాయుధ బలగాలు, పోలీసులను భారీ సంఖ్యలో మోహరించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ బీఎస్ఎస్ వెల్లడించింది. హాది మృతి రాజకీయ వర్గాల్లో, ఇంక్విలాబ్ మంచా కార్యకర్తల్లో, ప్రజల్లో తీవ్ర విషాదాన్ని కలిగించిందని బీఎస్ఎస్ పేర్కొంది. హాది మృతికి సంతాపంగా శనివారం ఒక రోజు జాతీయ సంతాప దినంగా తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ప్రకటించారు.

యూనస్ ప్రకటన అనంతరం గురువారం రాత్రి నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి హింసకు దిగారు. ఢాకాలోని ప్రముఖ పత్రికా కార్యాలయాలపై దాడులు చేయడంతో పాటు, చారిత్రక ప్రాధాన్యత ఉన్న '32 ధాన్‌మండి' భవనాన్ని ధ్వంసం చేశారు. అలాగే రాజ్‌షాహీ నగరంలో మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఆఫీసును కూడా కూల్చివేశారు. నిజానికి బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో కీలకమైన ఈ ధాన్‌మండి భవనాన్ని ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో భారీగా కూల్చివేశారు. గత ఏడాది ఆగస్టులో హసీనా ప్రభుత్వం పడిపోయిన సమయంలో కూడా నిరసనకారులు ఈ భవనానికి నిప్పు పెట్టారు.

భారత అసిస్టెంట్ హైకమిషనర్ నివాసంపై దాడి

చిట్టగాంగ్‌లో ఉన్న భారత అసిస్టెంట్ హైకమిషనర్ నివాసంపై నిరసనకారులు అర్ధరాత్రి పూట రాళ్లతో దాడి చేశారు. అయితే, ఈ దాడిలో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించి గుంపును చెదరగొట్టారు. ఈ గొడవకు కారణమైన 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. అటు ఢాకాలో కూడా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. అక్కడ 'ఛాయానాట్' అనే ప్రముఖ సాంస్కృతిక సంస్థ కార్యాలయంలోకి చొరబడిన నిరసనకారులు, లోపల ఉన్న ఫర్నిచర్‌ను రోడ్డుపైకి లాక్కొచ్చి నిప్పు పెట్టారు. దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చిన్నపాటి హింసాత్మక ఘటనలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

హాది భౌతికకాయం ఢాకా చేరుకున్నాక, ఆయనకు నివాళులు అర్పించేందుకు వేలాది మంది ప్రజలు విమానాశ్రయం నుండి షాహ్‌బాగ్ వరకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన శవపేటికను ఢాకా యూనివర్సిటీలోని సెంట్రల్ మసీదుకు తరలించారు. ఇక హాది అంత్యక్రియల విషయానికి వస్తే, శనివారం మధ్యాహ్నం జుహర్ నమాజ్ పూర్తయిన తర్వాత మణిక్ మియా అవెన్యూలో నిర్వహిస్తామని 'ఇంక్విలాబ్ మంచా' సంస్థ తమ ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించింది.

ఢాకా బిజోయ్‌నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్న సమయంలో మాస్కులు ధరించిన గన్‌మెన్ హాది తలపై కాల్చారని, ఆ తర్వాత సింగపూర్‌లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారని అధికారులు తెలిపారు.

గురువారం రాత్రి, జూలై ఉద్యమానికి నాయకత్వం వహించిన స్టూడెంట్స్ అగెనెస్ట్ డిస్క్రిమినేషన్‌కు చెందిన విభాగమైన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) డాకా యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన సంతాప ర్యాలీలో పాల్గొంది. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. హాది హంతకులు భారత్‌కు పారిపోయారని ఆరోపిస్తూ భారత హై కమిషన్‌ను మూసివేయాలని డిమాండ్ చేశారు. “హాది భాయ్ హంతకులను భారత్ అప్పగించే వరకు భారత హై కమిషన్ మూసివేయాలి” అని ఎన్‌సీపీ నేత సర్జిస్ ఆలమ్ వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో ఢాకాలోని కార్వాన్ బజార్ ప్రాంతంలో ప్రథమ్ అలో, డైలీ స్టార్ పత్రికల కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. పత్రికా సిబ్బంది లోపలే ఉండగానే పలు అంతస్తులను ధ్వంసం చేసి, భవనం ఎదుట నిప్పు పెట్టారు.

ఈ ఘటనలను మాజీ ప్రధాని ఖలేదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ పరిస్థితికి యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బాధ్యత వహించాలని పేర్కొంది. మరోవైపు, దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన యూనస్.. హాదిని దారుణంగా చంపిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుని కోర్టు ముందు నిలబెడతామని, ఆ హంతకులపై ఎలాంటి దయ చూపించబోమని ఆయన హెచ్చరించారు.

బంగ్లాదేశ్‌లో మరోసారి చెలరేగిన హింస - Tholi Paluku