Let's talk: editor@tmv.in
ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ విచారణకు హాజరైన మాజీ ఎంపీ సంతోష్ కుమార్

ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ విచారణకు హాజరైన మాజీ ఎంపీ సంతోష్ కుమార్

Gaddamidi Naveen
28 జనవరి, 2026

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసుల మేరకు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మంగళవారం విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్‌ ఏసీపీ కార్యాలయంలో ఆయనను అధికారులు విచారించారు.మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సమీప బంధువైన మేనల్లుడు సంతోష్ కుమార్‌కు సోమవారమే సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి, విచారణాధికారి ఎదుట హాజరుకావాలని ఆదేశించారు.

ఈ కేసులో ఇప్పటికే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జనవరి 23న, సీనియర్‌ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు జనవరి 20న సిట్ ఎదుట హాజరై విచారణకు లోనయ్యారు.ఈ కేసు గత బీఆర్‌ఎస్‌ పాలనలో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థకు చెందిన వ్యక్తులు సహా పలువురు ప్రముఖుల ఫోన్లను అనధికారికంగా, అక్రమంగా ట్యాప్‌ చేశారనే తీవ్రమైన ఆరోపణలకు సంబంధించినదిగా పోలీసులు తెలిపారు.

ఈ వ్యవహారంలో మాజీ తెలంగాణ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఆయనను సిట్ విచారించింది. అంతేకాక, తెలంగాణ ప్రత్యేక ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు చెందిన ఓ సస్పెండెడ్‌ డీఎస్పీతో పాటు మరో ముగ్గురు పోలీసు అధికారులను హైదరాబాద్‌ పోలీసులు మార్చి 2024లో అరెస్టు చేశారు. వీరు ఎలక్ట్రానిక్‌ పరికరాల్లోని ఇంటెలిజెన్స్‌ డేటాను తొలగించడం, ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనంతరం వీరికి బెయిల్‌ మంజూరైంది.

ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ విచారణకు హాజరైన మాజీ ఎంపీ సంతోష్ కుమార్ - Tholi Paluku