Let's talk: editor@tmv.in
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. సిట్‌ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్‌రావు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. సిట్‌ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్‌రావు

Gaddamidi Naveen
13 డిసెంబర్, 2025

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, రాష్ట్ర మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో విచారణాధికారిని ఆయ‌న స్వయంగా కలిసి సమర్పించుకున్నారు. వారం రోజుల పాటు ప్రభాకర్‌రావు కస్టోడియల్‌ విచారణకు సుప్రీంకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది.

ఫోన్ ట్యాపింగ్‌ కేసు నేపథ్యం

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్‌ఐబీ వనరులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. నిందితులు వివిధ వృత్తులకు చెందిన పౌరుల ఫోన్లను నిఘాలో పెట్టి, వారి వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా సేకరించారని పోలీసుల ఆరోపణ. అదేవిధంగా, ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉన్న నిఘా సమాచారం పెద్ద ఎత్తున డిలీట్‌ చేయడం, రికార్డులను నాశనం చేసి ఆధారాలు చెరిపివేయడానికి కుట్ర పన్నినట్లు కేసు వివరాలు చెబుతున్నాయి.

ఇప్పటివరకు అరెస్ట్ అయిన అధికారులు

ఈ కేసులో 2024 మార్చి నుంచి ఈ కేసులో ఇప్పటికే నాలుగు మంది ఎస్‌ఐబీ అధికారులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో సస్పెండ్‌ చేసిన ఒక డీఎస్పీ కూడా ఉన్నాడు. వీరందరికీ అనంతరం బెయిల్‌ మంజూరైంది.

సుప్రీంకోర్టు ఆదేశాలపై లొంగింపు

గురువారం జరిగిన విచారణలో జస్టిస్‌ బి.వి. నాగరత్న, జస్టిస్‌ ఆర్‌. మహాదేవన్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ ప్రభాకర్‌ రావును శుక్రవారం మధ్యాహ్నం 11 గంటలలోపు జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో లొంగిపోవాలని ఆదేశించింది. విచారణ ప్రయోజనాల కోసం కస్టడీ అవసరమైతే చట్ట ప్రకారం మాత్రమే ప్రశ్నించాలని స్పష్టం చేసింది. అదే విధంగా, ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇంటి నుంచి ఆహారం, మందులు అందించే అవకాశం కూడా కోర్టు ఇచ్చింది.

గత కొన్ని నెలల కోర్టు పరిణామాలు

మే 29న సుప్రీంకోర్టు ప్రభాకర్‌ రావుకు అరెస్ట్‌ పై తాత్కాలిక రక్షణను ఇచ్చి, తన పాస్‌పోర్టు అందుకున్న మూడు రోజులలోపే భారత్‌కు తిరిగి రావాలని షరతు విధించింది. అయితే, ఆయన ముందస్తు బెయిల్‌ కోరి పెట్టుకున్న దరఖాస్తును తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక మే 22న హైదరాబాద్‌ స్థానిక కోర్టు ఆయనపై ప్రొక్లమేషన్‌ నోటీసు జారీ చేసింది. జూన్‌ 20కి లోపల కోర్టు ముందు హాజరు కాకపోతే ‘ప్రోక్లైమ్‌డ్‌ ఆఫెండర్‌’గా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. ప్రోక్లైమ్‌డ్‌ ఆఫెండర్‌గా ప్రకటించబడితే ఆస్తుల జప్తు చేసే అధికారం కోర్టుకు లభిస్తుంది.

తాజా పరిణామం

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాల ప్రకారం ప్రభాకర్‌ రావు పోలీసులకు లొంగిపోయారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు, రికార్డుల నాశనం, అక్రమ నిఘాతో సంబంధం ఉన్న అంశాలపై ఇంకా వివరమైన విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిన ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం, సుప్రీంకోర్టు జోక్యం తరువాత మరింత కీలక దశకు చేరుకుంది.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. సిట్‌ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్‌రావు - Tholi Paluku