Let's talk: editor@tmv.in
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్ రావు నేడు లొంగిపోవాలి: సుప్రీం కోర్టు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్ రావు నేడు లొంగిపోవాలి: సుప్రీం కోర్టు

Pinjari Chand
12 డిసెంబర్, 2025

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న రాష్ట్ర మాజీ స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్ఐబీ) చీఫ్‌ టీ ప్రభాకర్ రావు నేడు (శుక్రవారం) ఉదయం 11 గంటలకల్లా పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం న్యాయవాదులు బి. వి. నాగరత్న, ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేస్తూ, ఆయనపై ఉన్న కేసులపై మరింత దర్యాప్తు చేసేందుకు ఆయన లొంగిపోవడమే మేలని పేర్కొంది.

ఇంటి నుంచి ఆహారాన్ని తెచ్చుకోవచ్చు

పిటిషనర్‌ రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లోని దర్యాప్తు అధికారిని సంప్రదించి లొంగిపోవాలి. కస్టడీ విచారణ చట్టం ప్రకారం కొనసాగాలి. ఆహారం, మందులు ఇంటి నుంచి తెచ్చుకునే అనుమతి ఇచ్చామని బెంచ్‌ స్పష్టం చేసింది. వాదనలు విన్న సమయంలో, రాష్ట్ర తరఫున హాజరైన సీనియర్‌ అడ్వకేట్‌ సిద్ధార్థ్ లూత్రా, ప్రభాకర్ రావు ఓపెన్‌ చేసినట్లు చెప్పిన ఐ క్లౌడ్ ఖాతాల్లో ఎలాంటి డేటా లేదని, ఈమెయిల్‌ కూడా ఓపెన్‌ కావడం లేదని కోర్టుకు సమాచారం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం బుధవారం కోర్టులో, తన ఐ క్లౌడ్ ఖాతాలను పూర్వ ఆదేశాల ప్రకారం అందించకుండా రావు ఇప్పటికీ నిరాకరిస్తున్నారని ఆరోపించింది.

సుప్రీం కోర్టులో పిటిషన్

ఇంతకుముందు మే 29న సుప్రీంకోర్టు ఆయనకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించినప్పుడు, పాస్‌పోర్ట్‌ తిరిగి పొందిన మూడు రోజుల్లో దేశానికి వచ్చేస్తానని అండర్‌టేకింగ్‌ ఇవ్వాలని ఆదేశించింది. తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మే 22న హైదరాబాద్‌లోని కోర్టు ప్రభాకర్‌ రావుపై ప్రకటన ఉత్తర్వు జారీ చేసింది. జూన్‌ 20లోగా హాజరుకాకపోతే ‘ప్రొక్లెయిమ్డ్‌ ఆఫెండర్‌’గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొంది. అలా ప్రకటిస్తే, ఆస్తుల జప్తు కూడా చేయొచ్చు.

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో 2024 మార్చి నుంచి ఎస్ఐబీకి చెందిన ఒక సస్పెండ్‌ డీఎస్పీతో పాటు నలుగురు అధికారులను హైదరాబాదు పోలీసులు అరెస్టు చేశారు. ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ల నుంచి ఇంటెలిజెన్స్‌ సమాచారం తొలగించడం, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కాలంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌ జరిపినట్లు ఆరోపణలతో వీరిని అరెస్టు చేసి, అనంతరం బెయిల్‌ మంజూరైంది. పోలీసుల ప్రకారం, ఈ కేసులో నిందితులు ఎస్ఐబీ వనరులను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించి పౌరులపై గూఢచర్యం చేసినట్లు, పలువురి వివరాలను అనుమతి లేకుండా సేకరించి అక్రమంగా పర్యవేక్షించినట్లు, తమ నేరాలకు సంబంధించిన ఆధారాలను నాశనం చేసేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్ రావు నేడు లొంగిపోవాలి: సుప్రీం కోర్టు - Tholi Paluku