
ఫుట్బాల్ ప్రపంచకప్లో ఆడేది అనుమానమే: ఇరాన్ సాకర్ ఫెడరేషన్
ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులు అంతర్జాతీయ క్రీడా వేదికలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జూన్ నెలలో అమెరికా, కెనడా, మెక్సికో దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న ఫుట్బాల్ ప్రపంచకప్ (మెగా టోర్నీ)లో ఇరాన్ జట్టు పాల్గొనడంపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. తమ దేశంపై క్షిపణుల వర్షం కురుస్తున్న తరుణంలో, అమెరికా గడ్డపై జరిగే మ్యాచ్లలో తమ జట్టు పాల్గొంటుందో లేదో చెప్పలేమని ఇరాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ (ఇరాన్ సాకర్ ఫెడరేషన్) అధ్యక్షుడు మెహదీ తాజ్ ఆందోళన వ్యక్తం చేశారు.జరిగిన దాడుల తర్వాత ప్రపంచకప్పై ఆశలు పెట్టుకోవడం సాధ్యం కాదని ఆయన తెగేసి చెప్పారు.
‘గ్రూప్-జి’లో ఇరాన్.. లాస్ ఏంజిల్స్లో మ్యాచ్లు
ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం ఇరాన్ జట్టు ‘గ్రూప్-జి’లో చోటు సంపాదించుకుంది. జూన్ 15న లాస్ ఏంజిల్స్లో న్యూజిలాండ్తో, జూన్ 21న బెల్జియంతో తలపడాల్సి ఉంది. అనంతరం జూన్ 26న సీటెల్ వేదికగా ఈజిప్టుతో తన చివరి గ్రూప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత నెలకొన్న అస్థిరత, ఇజ్రాయెల్తో కొనసాగుతున్న దాడులు-ప్రతిదాడుల నేపథ్యంలో క్రీడాకారుల భద్రత, ప్రయాణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం విధించిన ప్రయాణ ఆంక్షల కారణంగా ఇరాన్ అభిమానుల రాకపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
పర్యవేక్షిస్తున్న ఫిఫా
ఈ ఉద్రిక్త పరిస్థితులపై ప్రపంచ ఫుట్బాల్ నియంత్రణ సంస్థ 'ఫిఫా' స్పందించింది. పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. అయితే ఇరాన్ భాగస్వామ్యంపై తుది నిర్ణయం లేదా ప్రస్తుత గందరగోళంపై అసోసియేటెడ్ ప్రెస్ పంపిన ఈమెయిల్కు ఫిఫా ఇంకా అధికారికంగా సమాధానం ఇవ్వలేదు. జూన్ 11న ప్రారంభమై జూలై 19 వరకు సాగే ఈ మహా సంగ్రామంలో రాజకీయ ఉద్రిక్తతలు క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తాయేమోనని అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
