Let's talk: editor@tmv.in
ఫిబ్రవరిలో థాయ్‌లాండ్ ఎన్నికలు: ప్రధాని అభ్యర్థిగా అనుటిన్ ఎంపిక

ఫిబ్రవరిలో థాయ్‌లాండ్ ఎన్నికలు: ప్రధాని అభ్యర్థిగా అనుటిన్ ఎంపిక

Shaik Mohammad Shaffee
25 డిసెంబర్, 2025

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో థాయ్‌లాండ్‌లో ఎన్నికలు జరగనుండటంతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా ఉన్న అనుటిన్ చార్న్‌విరకూల్ మళ్లీ ప్రధాని పదవికి పోటీ పడనున్నారు. ఆయన సొంత పార్టీ అయిన ‘భూమ్‌జైతాయ్’, బుధవారం జరిగిన సమావేశంలో అనుటిన్‌ను తమ అధికారిక ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది.

అనుటిన్ ఇటీవలే ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే ప్రభుత్వం మైనారిటీలో ఉండటంతో అవిశ్వాస తీర్మానం ముప్పు ఏర్పడింది. దీంతో ఆయన ఈ నెల ఆరంభంలోనే పార్లమెంటును రద్దు చేసి, ఫిబ్రవరి 8న ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికలను అనుటిన్ “భూమ్‌జైతాయ్ పార్టీకి అత్యంత కీలకమైన ఎన్నికలు”గా అభివర్ణించారు.

పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన అనుటిన్, థాయ్‌లాండ్ ప్రజలకు సేవ చేసేందుకు తాము మళ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 2008లో తమ పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యంత కీలకమైనదని ఆయన చెప్పారు. ఈసారి థాయ్ ప్రజలు తమ పార్టీపై ఎంతో నమ్మకం, భారీ ఆశలు పెట్టుకున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే, ప్రస్తుతం ఉన్న కీలక మంత్రులను కొనసాగిస్తామని అనుటిన్ హామీ ఇచ్చారు. ఆర్థిక మంత్రి ఎక్నిటి నితిథన్‌ప్రపాస్, విదేశాంగ మంత్రి సిహసక్ ఫుయాంగ్‌కెట్‌కియో, వాణిజ్య మంత్రి సుఫజీ సుతుంపున్ తమ పదవుల్లో కొనసాగుతారని చెప్పారు.

ఇటీవల కాంబోడియాతో సరిహద్దు వివాదం మళ్లీ చెలరేగడంతో థాయ్‌లాండ్‌లో జాతీయ భావాలు పెరిగాయి. ఈ పరిస్థితి అనుటిన్‌కు రాజకీయంగా లాభం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఏ పార్టీకి కూడా ఈ ఎన్నికల్లో ఒంటరిగా గెలిచేంత మెజారిటీ వచ్చేలా లేదని, పోటీ చాలా తక్కువ తేడాతో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఫ్యూ థాయ్ పార్టీకి చెందిన నేత యోడ్‌చనన్ వాంగ్‌సవాట్ మాట్లాడుతూ, అవసరమైతే తాము కూటమి ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇది ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారే అవకాశాన్ని సూచిస్తోంది.

ఇటీవల జాతీయ అభివృద్ధి పరిపాలనా సంస్థ (ఎన్‌ఐడీఏ) నిర్వహించిన సర్వేలో భూమ్‌జైతాయ్ పార్టీకి 9.92 శాతం మద్దతు మాత్రమే లభించింది. ఇది ప్రధాన పార్టీల్లో నాలుగో స్థానం. అయితే ఇంకా 32.36 శాతం ఓటర్లు ఏ పార్టీని ఎన్నుకోవాలో నిర్ణయించుకోలేదు. దీంతో రాబోయే రోజుల్లో భూమ్‌జైతాయ్ పార్టీకి మద్దతు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

2023 ఎన్నికల్లో భూమ్‌జైతాయ్ పార్టీ మూడో స్థానంలో నిలిచి, ఫ్యూ థాయ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో భాగమైంది. కానీ అప్పటి ప్రధానమంత్రి పేటాంగ్‌టార్న్ షినవత్ర, కాంబోడియా మాజీ నేత హున్ సెన్ మధ్య జరిగిన ఒక ఫోన్ కాల్ లీక్ కావడంతో రాజకీయ కలకలం చెలరేగింది. ఆ పరిణామాల నేపథ్యంలో భూమ్‌జైతాయ్ పార్టీ కూటమి నుంచి వైదొలిగింది.

ఆ తరువాత ఆగస్టులో రాజ్యాంగ ధర్మాసనం పేటాంగ్‌టార్న్‌ను పదవి నుంచి తొలగించింది. ఈ పరిణామాలు అనుటిన్‌కు ప్రధానమంత్రి పదవి దక్కేలా చేశాయి. సెప్టెంబర్‌లో పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌లో, ప్రతిపక్ష పీపుల్స్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని అనుటిన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆ ఒప్పందం ఈ నెలలోనే విఫలమైంది. దీంతో థాయ్‌లాండ్‌లో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టంగా మారాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.