
ఫీజు రీయింబర్స్మెంట్ ఏబీవీపీ ధర్నా
అఖిల భారత విద్యార్థి పరిషత్ విశాఖపట్నం నగరశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.6,400 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ విశాఖ విభాగ్ కన్వీనర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.6,400 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు పెండింగ్ పెట్టి, ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుకోవడం సరికాదన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్న టువంటి ఫీజు రీయింబర్స్ మెంట్ విద్యార్థులకు భిక్ష కాదని, విద్యార్థుల హక్కు అని ప్రభుత్వం గుర్తించాలని ఆయన కోరారు.
ఇదే మొండి వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళితే విద్యార్థి పరిషత్ ఉద్యమాలు బాట పడుతుందని ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, విద్యార్థులు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తారని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా నగర కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ సరైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో ఎంతోమంది విద్యార్థులను వారి కళాశాలలో యాజమాన్యం పరీక్షల సమయంలో హాల్ టికెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి విషయాలను పరిశీలించి బకాయిలు వీలైనంత త్వరగా విడుదల చేసి విద్యార్థుల జీవితాల్లో విద్యా వెలుగులు నింపాలని ఆయన కోరారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా కన్వీనర్ నితిన్, సహకార దర్శి ధనుష్, నితిన్, విష్ణు వెంకటేష్, సంపత్, ముక్తేష్, తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.
