
ప్రేమ పెళ్లికి నిరాకరించారని విషం ఇంజెక్షన్లతో తల్లిదండ్రులను చంపిన కూతురు
కులాంతర వివాహానికి అంగీకరించలేదన్న కోపంతో ఒక నర్సు తన కన్నతల్లిదండ్రులనే కడతేర్చిన సంచలన ఘటన వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో వెలుగుచూసింది. కేవలం తన ప్రేమ కోసం కనిపెంచిన వారినే మత్తు మందు ఇంజెక్షన్లు ఇచ్చి చంపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న 23 ఏళ్ల సురేఖ, జనవరి 24న తన తండ్రి దశరథ్ (58), తల్లి లక్ష్మి(52)లకు మత్తు మందు ఇంజెక్షన్లు అధిక మోతాదులో ఇచ్చి హత్య చేసింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన మరో కులానికి చెందిన యువకుడిని ఆమె ప్రేమించింది. అతడిని వివాహం చేసుకోవాలని కోరగా తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు.
తల్లిదండ్రుల నిరాకరణతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి, వారిని అడ్డుగా తొలగించాలనే దురాలోచనకు వెళ్లింది. ఆసుపత్రిలో నుంచి మత్తు ఇంజెక్షన్లు తీసుకొచ్చిన ఆమె, శరీర నొప్పులకు మందులు ఇస్తున్నానని చెప్పి ముందుగా తల్లికి, ఆ తర్వాత తండ్రికి ఇంజెక్షన్లు వేసింది. అధిక మోతాదులో మత్తుమందు ఇవ్వడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటన అనంతరం యువతి తన అన్నకు ఫోన్ చేసి, తల్లిదండ్రులు వ్యవసాయ రుణభారం కారణంగా మృతి చెందినట్టు చెప్పింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మొదట అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. అయితే ఇంట్లో లభించిన మూడు ఇంజెక్షన్లు, వాటి బ్యాచ్ నంబర్లు సంగారెడ్డి ఆసుపత్రిలో ఉన్న ఇంజెక్షన్లతో సరిపోలడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
తదుపరి విచారణలో యువతిని ప్రశ్నించగా, ఆమె నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. కేసు సెక్షన్లు మార్చి ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు వెల్లడించారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
