
ప్రశాంతంగా తొలిదశ పంచాయతీ ఎన్నికలు
తెలంగాణలో గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశలో 84 శాతం కంటే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది. మొత్తం 53,57,277 మంది అర్హులలో 45,15,141 మంది ఓటర్లు ఓటును వేశారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. అనంతరం 2 గంటలకు లెక్కింపును ప్రారంభించారు.
ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అదనపు డీజీపీ మహేష్ ఎం. భగవత్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలను క్రిటికల్, నార్మల్గా వర్గీకరించి తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా, 396 గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయని ఎన్నికల సంఘం పేర్కొంది.సర్పంచ్ పదవికి సుమారు 13,000 మంది పోటీ చేశారు. అలాగే 27,628 వార్డులకు 65,455 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
కాంగ్రెస్ ఘన విజయం: మహేశ్ కుమార్ గౌడ్
తొలి దశలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోటీ చేసిన అభ్యర్థులు 90శాతానికి పైగా సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నారని, ఇది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని టీపీసీసీఅధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రెండేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలు సమర్థించారని ఆయన పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధి—మన నినాదాన్ని ప్రజలు ఆశీర్వదించారు. గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు దానికి ధృవీకరణ అని ఆయన అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మా బలం పెరుగుతోంది:బీజేపీ
ఇదే విషయం మీద స్పందించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పనితీరులో గణనీయమైన వృద్ధి కనిపించిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి పెరుగుతున్న మద్దతుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ–అభివృద్ధి పథకాలు కారణమని తెలిపారు. వాటి వల్లే పేదల జీవితం మారిపోయిందని ఉచిత బియ్యం, ఇళ్ల పథకం, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, పీఎం-కిసాన్, వీధి దీపాలు, రహదారులు, మరుగుదొడ్లు—వంటి పథకాల ప్రభావాన్ని ప్రజల్లో మరింతగా చాటాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మిగిలిన దశల్లో మరింత బలంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో
రాష్ట్ర ఎన్నికల సంఘం నవంబర్ 25న ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో—డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరుగుతున్నాయి. ఇటీవలి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ల ప్రజాదరణకు పరీక్షగా భావిస్తున్నారు. అయితే ఎన్నికలు అధికారికంగా పక్షపాత్ర రహితంగా జరుగుతున్నాయి.
బీసీ రిజర్వేషన్లపై చట్టపరమైన సమస్యలతో
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వచ్చిన చట్టపరమైన అడ్డంకుల కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలను మాత్రమే నిర్వహిస్తూ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను వాయిదా వేసినట్లు నవంబర్ 17న ప్రకటించింది.
ఈ ఫలితాలు రాత్రి తొమ్మిది గంటల వరకు వచ్చిన వివరాలు
మొత్తం కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచిన సర్పంచ్ స్థానాలు 1437, బీఆర్ఎస్ 697, బీజేపీ 126. ఇతరులు 327 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఫలితాలు ఆలస్యంగా కావడం వల్ల కొన్నిచోట్ల ఉపసర్పంచ్ ను శుక్రవారం ఎన్నుకోనున్నారు.
