

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గాయి: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్ ప్లస్) గణాంకాలు.. ప్రైవేటు పాఠశాలల నుంచి 1.1 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోకి మారారన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై అధికార టీడీపీ నుంచి తక్షణ స్పందన వెలువడలేదు.
2023-24లో, అంటే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోని గణాంకాలతో 2025-26 యూడైస్ ప్లస్ వివరాలను పోల్చితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు గణనీయంగా తగ్గినట్లు స్పష్టమవుతోందని జగన్ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి పెద్ద సంఖ్యలో విద్యార్థులు మారి ఉంటే.. అక్కడ మొత్తం విద్యార్థుల సంఖ్య పెరగాల్సి ఉందని అన్నారు.
జగన్ తెలిపిన వివరాల ప్రకారం.. 2023-24లో ప్రభుత్వ పాఠశాలల్లో 40,50,116 మంది విద్యార్థులు ఉండగా, 2025-26 నాటికి ఆ సంఖ్య 34,93,450కు తగ్గింది. అంటే రెండేళ్లలో 5.5 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222కు తగ్గిందన్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు కూడా 991 నుంచి 797కు తగ్గినట్లు తెలిపారు.
మరోవైపు ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని జగన్ అన్నారు. 2023-24లో ప్రైవేటు పాఠశాలల్లో 45,53,380 మంది విద్యార్థులు ఉండగా.. 2025-26లో ఆ సంఖ్య 48,40,296కు పెరిగిందని వివరించారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం, ప్రైవేటు పాఠశాలల్లో పెరగడం రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిస్థితిని తెలియజేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రైవేట్ సంస్థల ప్రయోజనాల కోసమే బడుల నిర్వీర్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా రంగం కొద్దిమంది బడా కార్పొరేట్ సంస్థల గుప్పెట్లో ఉందని, ప్రస్తుత ప్రభుత్వానికి వారితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని జగన్ ఆరోపించారు. ప్రైవేట్ సంస్థల వృద్ధిని ప్రోత్సహించడం కోసమే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ బడుల ఫీజులు చెల్లించలేని పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరం కావడం అత్యంత ఆందోళన కలిగించే పరిణామం అని వ్యాఖ్యానించారు.
వైఎస్సార్సీపీ హయాంలో విద్యా సంస్కరణలు
2019-2024 మధ్య కాలంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు తాము చేపట్టిన పలు విప్లవాత్మక సంస్కరణలను జగన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. 'మన బడి - నాడు నేడు' కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, జూనియర్ కళాశాలల్లో ఫర్నిచర్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను ఆధునీకరించినట్లు తెలిపారు.
ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో పాటు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను విద్యార్థులకు అందించినట్లు తెలిపారు. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంపొందించేందుకు మూడో తరగతి నుంచే టెస్టు ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ ను ప్రవేశపెట్టి, అంతర్జాతీయ ధ్రువీకరణ కోసం అమెరికన్ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు జగన్ తెలిపారు. మన విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా ప్రభుత్వ బడుల్లో ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని జగన్ స్పష్టం చేశారు.
