Let's talk: editor@tmv.in
ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Gaddamidi Naveen
1 మార్చి, 2026

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి ఇజ్రాయెల్ పర్యటనపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఇక్కడి మసీదు-ఎ-చౌక్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఇజ్రాయెల్ సైనిక చర్యల వల్ల గాజాలో వేల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఉగ్రవాదం కిందికి రాదా అని ప్రశ్నించారు. ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో, 1994లో అదే రోజున ఒక యూదు ఉగ్రవాది మసీదులో 29 మందిని హత్య చేసిన ఘటనను ప్రధాని ప్రస్తావించలేదని ఆయన విమర్శించారు.

గాజాలో ఇప్పటివరకు 73 వేలకుపైగా మరణాలు నమోదయ్యాయని, వేలాదిమంది గల్లంతయ్యారని ఓవైసీ పేర్కొన్నారు. మరణించిన వారంతా హమాస్‌కు చెందినవారేనా? 73 వేల మందిలో 36 వేల మంది చిన్నపిల్లలు, సుమారు 15 వేల మంది మహిళలు ఉన్నారని సమాచారం. వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అక్కడి మల్బాను తొలగించడానికి కనీసం పది సంవత్సరాలు పడుతుంది. ఇది ఉగ్రవాదం కాదా? అని ఆయన ప్రశ్నించారు.

ప్రధాని మోదీ తన ప్రసంగంలో హమాస్ చర్యలను ఖండించడం సరైనదేనని, అయితే అదే సమయంలో ఇజ్రాయెల్ ఉగ్రవాదం గురించీ మాట్లాడాల్సిందని ఓవైసీ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులను తమ పార్టీ అయిన ఎంఐఎం ఖండించిందని కూడా ఆయన తెలిపారు.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో నివసిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆమెను తిరిగి పంపితే రెండు దేశాల మధ్య సమస్యలు పరిష్కారమవుతాయని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీకి ఇజ్రాయెల్‌పై ఉన్న అనుబంధం కేవలం దౌత్య సంబంధం కాదని, అది సిద్ధాంతపరమైనదని ఆయన ఆరోపించారు. 1970లలో ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ జనసంఘ్ నాయకులతో సమావేశమయ్యిందని ఒక మీడియా నివేదికను ప్రస్తావించారు. అలాగే మహాత్మా గాంధీ హంతకుడు నాథూరాం గోడ్సే సోదరుడు గోపాల్ గోడ్సే కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం కోసం ఇజ్రాయెల్ అధికారులను సంప్రదించాడని వచ్చిన పాత మీడియా కథనాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రపంచ దక్షిణ దేశాలు మోదీ-ఇజ్రాయెల్ సంబంధాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. యుద్ధాలకు వ్యతిరేకమని ప్రధాని చెబితే, అమెరికా ఇరాన్‌పై దాడి చేయనున్నదన్న ఊహాగానాలపై కూడా స్పష్టమైన అభిప్రాయం చెప్పాల్సిందని డిమాండ్ చేశారు.జైన్యిజం, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలు ద్వేషంపై ఆధారపడి ఉన్నాయని ఓవైసీ ఆరోపించారు. చరిత్రను ప్రస్తావిస్తూ, 1962 చైనా-భారత్ యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలను స్వీకరించారని గుర్తు చేశారు.

దేశీయ అంశాలపై విమర్శలు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముస్లిం ఆటో డ్రైవర్లకు తక్కువ చార్జీలు ఉండాలనే వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలపై కూడా ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల లబ్ధి కోసం సామాజిక ఐక్యతను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఇక తెలంగాణలోని వేములవాడలో దర్గా కూల్చివేత ఘటనను, ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్లలో ప్రాంతాల్లో జరిగిన ద్వేషపూరిత నేరాలను ఆయన తీవ్రంగా ఖండించారు. గుజరాత్‌లో పెళ్లికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసే ప్రతిపాదిత చట్టంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.