Let's talk: editor@tmv.in
ప్రజల సాధికారత కేంద్రం సేవా తీర్థ్: కేబినెట్ తీర్మానం

ప్రజల సాధికారత కేంద్రం సేవా తీర్థ్: కేబినెట్ తీర్మానం

Pinjari Chand
25 ఫిబ్రవరి, 2026

కొత్త ప్రధాని కార్యాలయ సముదాయం ‘సేవా తీర్థ్’లో జరిగిన తొలి సమావేశంలో కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం ఆమోదించింది. ఈ ప్రాంగణంలో తీసుకునే ప్రతి నిర్ణయం ‘నాగరిక్ దేవో భవ’ భావనతో ప్రేరణ పొందుతుందని, ఇది అధికార ప్రదర్శన స్థలం కాకుండా ప్రతి భారతీయుడి సాధికారతకు కేంద్రంగా నిలుస్తుందని స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆమోదించిన ఈ తీర్మానాన్ని ‘సేవా సంకల్ప తీర్మానం’గా పేర్కొన్నారు. దేశంలోని చివరి వ్యక్తి జీవితాన్ని సులభతరం చేసే దిశగా ప్రతి పరిపాలనా చర్య ఉండాలని కేబినెట్ సంకల్పం వ్యక్తం చేసింది.

కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, ‘సేవా తీర్థ్’లో పని సంస్కృతి రాజ్యాంగ మౌలిక విలువలతో నడుస్తుందని, ప్రతి విధానం ప్రజల ఆశయాలకు బాధ్యత వహించేలా ఉండాలని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం దశాబ్దాల పాటు ప్రధాని కార్యాలయం సౌత్ బ్లాక్‌లో నడిచిందని, ఇప్పుడు ఆధునికతతో పాటు స్వదేశీ ఆలోచనలను ప్రతిబింబించే నిర్మాణంగా ‘సేవా తీర్థ్’ రూపుదిద్దుకుందని తీర్మానంలో పేర్కొన్నారు. ఇది ‘న్యూ ఇండియా’ పునర్నిర్మాణానికి ప్రతీకగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

గత దశాబ్దంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం, ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్ల మందికి ఆరోగ్య భద్రత కల్పించడం, ప్రధాన మంత్ర గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా సుమారు 80 కోట్ల మందికి ఆహార భద్రత అందించడం వంటి చర్యలను తీర్మానంలో ప్రస్తావించారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించడం, కోట్లాది ఇళ్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీటి సరఫరా కల్పించడం వంటి కార్యక్రమాలు పరిపాలనలో మార్పుకు నిదర్శనమని పేర్కొన్నారు. ‘మినిమమ్ గవర్నమెంట్, మాక్సిమమ్ గవర్నెన్స్’ మంత్రంతో అమలు చేసిన జీఎస్టీ, డీబీటీ, డిజిటల్ ఇండియా వంటి సంస్కరణలు పరిపాలనను పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చాయని తీర్మానం పేర్కొంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం (‘విక్సిత్ భారత్ 2047’) లక్ష్య సాధన దిశగా ‘సేవా తీర్థ్’ జాతీయ ఆకాంక్షలకు శక్తివంతమైన కేంద్రంగా నిలుస్తుందని కేబినెట్ స్పష్టం చేసింది. ‘సేవా తీర్థ్’ కేవలం ఆధునిక కార్యాలయ సముదాయం మాత్రమే కాకుండా, బాధ్యతాయుతమైన, ప్రజాముఖ పరిపాలనకు ప్రతీకగా నిలుస్తుందని కేబినెట్ మరోసారి తన సంకల్పాన్ని పునరుద్ఘాటించింది.