
ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ తొలి పాలకవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, నూతన పాలకవర్గానికి దిశానిర్దేశం చేశారు.
రాబోయే ఐదేళ్ల పాటు ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పాలకవర్గం పనిచేయాలని సూచించారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ నిధులతో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, కాలువలు, తాగునీటి సరఫరా వంటి పనులను వేగవంతంగా చేపట్టనున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభిస్తామని ఆయన అన్నారు.
ప్రజలు నమ్మి ఓటేశారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, కమిషనర్ దశరథ్ తో పాటు కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గుమ్మడిదలను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
