
ప్రకృతిని మళ్లీ పునరుజ్జీవింపజేద్దాం: స్వదేశీ జాతుల కాపాడుదాం
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల “మన్ కీ బాత్” కార్యక్రమంలో భారత స్వదేశీ కుక్క జాతులను సంరక్షించాలన్న పిలుపు ఇచ్చారు. ఇది కేవలం జంతు ప్రేమికులకే కాదు దేశ పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి అన్నీ కలిసిన పెద్ద ఉద్యమానికి ఆహ్వానం. స్వదేశీ మొక్కలు, జంతువులు, పక్షులు మన దేశ జీవవైవిధ్యానికి పునాది. వాటి సంరక్షణ అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడమే
భారతదేశం ప్రపంచంలో అత్యంత జీవవైవిధ్యమున్న 17 దేశాల్లో ఒకటి. గిర్, ఒంగోలు, సాహివాల్ వంటి పశు జాతులు కరువు ప్రాంతాల్లో కూడా జీవిస్తాయి. కగ్గ, నవరా వంటి వరి రకాలు వరదలను తట్టుకుంటాయి. పాలపిట్ట వంటి పక్షులు కీటకాలను నియంత్రించి పంటల సమతౌల్యాన్ని కాపాడుతాయి.
అయితే గత కొన్ని దశాబ్దాల్లో అధిక దిగుబడిని ఆశించి విదేశీ హైబ్రిడ్ జాతులను స్వీకరించడంతో, ఈ స్వదేశీ జాతులు మాయమవుతున్నాయి. జాతీయ జంతు జన్యు వనరుల బ్యూరో (NBAGR) ప్రకారం, భారతదేశపు పశు జాతులలో సగానికి పైగా కనుమరుగవ్వ బోతున్నాయి. ఇదే పరిస్థితి స్థానిక విత్తనాలు, పక్షులు, చేపల జాతుల విషయంలోనూ కనిపిస్తోంది.
పర్యావరణ ప్రాధాన్యం – ప్రకృతికి సహజ బీమా
స్వదేశీ జాతులు మన పర్యావరణానికి సహజ రక్షణ. ఇవి స్థానిక వాతావరణానికి తగినట్లుగా వందల ఏళ్లుగా అభివృద్ధి చెందాయి. థార్పార్కర్ ఆవులు రాజస్థాన్ ఎడారిలో కూడా పాలు ఇస్తుంది. వేప, రావి వంటి వృక్షాలు గాలిని శుభ్రం చేయటమే కాక భూగర్భ జలాలనూ పెంచుతాయి.
వీటిని కోల్పోతే ప్రకృతిలోని సమతౌల్యం దెబ్బతింటుంది. విదేశీ జాతులు చాలాసార్లు స్థానిక వ్యవస్థను దెబ్బతీస్తాయి హైబ్రిడ్ పంటలు భూసారాన్ని దెబ్బ తీస్తాయి, విదేశీ చేపలు స్థానిక చేపల జీవనాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి స్వదేశీ జాతులను కాపాడటం అంటే ప్రకృతిని కాపాడటమే.
ఆర్థిక ప్రాముఖ్యత – స్థానిక జీవనానికి ఆధారం
స్వదేశీ జాతులు తక్కువ ఖర్చుతో, ఎక్కువ స్థిరత్వంతో వ్యవసాయం మరియు పశుసంవర్ధకానికి మద్దతు ఇస్తాయి. ఇవి స్థానిక ఆహారానికి అలవాటు పడి తక్కువ మేత, తక్కువ నీటితో జీవిస్తాయి. గిర్ ఆవు పాలు A2 ప్రోటీన్ తో ఆరోగ్యకరమైనవిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కడక్ నాత్ కోడి తన రుచితో, ప్రోటీన్ విలువతో అధిక ధరలు సాధిస్తోంది.
రాగి, సజ్జ వంటి స్థానిక ధాన్యాలు తక్కువ ఖర్చుతో సాగవుతాయి. వాతావరణ మార్పులకు ఎదురు నిలబడగలిగే ఈ పంటలు భవిష్యత్తు ఆహార భద్రతకు కీలకం.
సాంస్కృతిక విలువ
స్వదేశీ జాతులు మన ఆచారాల, విశ్వాసాల లోతుల్లో ఉన్నాయి. ఆవు పూజ, వన దేవతల పూజ, విత్తన మార్పిడి పండుగలు ఇవన్నీ జీవవైవిధ్యానికి గౌరవ సూచకాలు. ఉసిరి, తులసి, వేప వంటి మొక్కలు ఆయుర్వేదానికి ఆధారం. నెమలి, హంస వంటి పక్షులు మన పురాణాలకు ప్రతీకలు.
ఈ జాతులను కాపాడటం అంటే మన సంస్కృతిని కాపాడటం. కాంక్రేజ్ మేకలను పెంచే గుజరాత్ కాపరులు, పశ్చిమ కనుమల తేనె సేకరించే గిరిజనులు వీరి జీవనాధారమే ఈ స్వదేశీ జాతులు.
ఉపేక్ష ఫలితాలు
విదేశీ హైబ్రిడ్ జాతులపై ఆధారపడడం వల్ల రైతులు ఎక్కువ ఖర్చులూ, పంటల రోగాలను ఎదుర్కొంటున్నారు. హైబ్రిడ్ పశువులు భారత వాతావరణంలో తక్కువ ఆయుష్షు కలిగి ఉంటాయి. రసాయనాల ఆధారిత పంటలు నేలను విషపూరితం చేస్తాయి. పక్షుల వలస మార్గాలు నశించడంతో అనేక పక్షి జాతులు, తేనెటీగలు కనుమరుగవుతున్నాయి. పంటల పరాగసంపర్కం తగ్గి, విత్తన ఉత్పత్తి దెబ్బతింటోంది. జన్యు వైవిధ్యం తగ్గిపోవడం మన భవిష్యత్ ఆహార భద్రతను ప్రమాదంలో పడేస్తోంది.
సంరక్షణ సవాళ్లు
సంరక్షణలో పెద్ద అడ్డంకి అవగాహన లోపం. రైతులు, వినియోగదారులు తరచుగా స్వదేశీ జాతులను “తక్కువ దిగుబడి”గా భావిస్తారు. మార్కెట్ కూడా అధిక ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది, స్థిరత్వాన్ని కాదు. అరణ్య నాశనం, నగరీకరణ వలన స్థానిక వాతావరణాలు నశిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ, అమలులో బలహీనంగా ఉంది. పర్యావరణం, వ్యవసాయం, ఆర్థికాభివృద్ధి ఇవన్నీ వేరు కాదు, ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయనే అవగాహన తక్కువగా ఉంది.
సమగ్ర దృక్పథం అవసరం
స్వదేశీ జాతుల సంరక్షణకు ప్రభుత్వం, ప్రజలు, శాస్త్రవేత్తలు కలిసి పని చేయాలి.
ప్రభుత్వం: స్థానిక పశువులను పెంచే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. దేశవ్యాప్తంగా జీవవైవిధ్య పటాలు, జన్యు రిజిస్టర్లు రూపొందించాలి.
ప్రజలు: స్థానిక విత్తనాలు వాడటం, స్వదేశీ జంతువులను దత్తత తీసుకోవడం, స్థానిక వృక్షాలను నాటటం, హైబ్రిడ్ జాతులపై ఆధారపడకపోవడం వంటి చర్యలు తీసుకోవాలి.
శాస్త్రవేత్తలు: స్వదేశీ జాతుల ఉత్పాదకతను పెంచే పరిశోధనలు చేయాలి, వాటి జన్యు వైవిధ్యాన్ని కాపాడుతూ ఆధునిక పద్ధతులు అవలంబించాలి.
విద్యా సంస్థలు, యువజన సంఘాలు, పర్యావరణ స్వచ్ఛంద సంస్థలు ఈ ఉద్యమాన్ని సామాజిక చైతన్యంగా మార్చాలి. ప్రైవేట్ రంగం స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ కల్పించాలి.
ముగింపు – ఇది మన బాధ్యత
ప్రధాని మోదీ స్వదేశీ కుక్క జాతుల పరిరక్షణపై చేసిన పిలుపు ఒక సంకేతం ఇది దేశభక్తి, పర్యావరణం రెండింటి సంగమం. స్వదేశీ జాతులను కాపాడటం అంటే మన భూమిని, మన భవిష్యత్తును కాపాడటం. ఆధునికత అంటే స్వభావాన్ని విడిచిపెట్టడం కాదు. మన పురాతన మూలాలు, మన జీవవైవిధ్యం మన భవిష్యత్ శక్తి. ప్రతి విత్తనం, ప్రతి జాతి, ప్రతి పక్షి ఇవన్నీ మన పర్యావరణ చరిత్రలో అమూల్యమైన భాగాలు. వాటిని కాపాడటం ప్రతి భారతీయుని కర్తవ్యము
