
పేపర్ వీసాలకు గుడ్బై.. యూకేలో అమల్లోకి ‘డిజిటల్ వీసా’ విధానం
బ్రిటన్ ప్రయాణంలో ఇకపై డిజిటల్ విధానమే కీలకం కానుంది . దేశ సరిహద్దులు, వలస విధానాలను పూర్తిగా డిజిటలైజ్ చేయడంలో భాగంగా, బ్రిటన్ ప్రభుత్వం ఈ కీలక మార్పులను అమల్లోకి తెచ్చింది. బుధవారం నుంచి ఈ నూతన నిబంధనలు అధికారికంగా అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం, ఇకపై భారతీయులతో సహా విదేశీ ప్రయాణికులకు 'ఈ-వీసా' తప్పనిసరి. అలాగే వీసా అవసరం లేని దేశాల పౌరుల కోసం 'ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్' (ఈటీఏ) విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది
ఏమిటీ కొత్త మార్పులు?
గతంలో మాదిరిగా ఇకపై పాస్పోర్టుల మీద స్టాంపులు, స్టిక్కర్ల రూపంలో వీసా అనుమతులు ఉండవు. దీని స్థానంలో డిజిటల్ పత్రాలను బ్రిటన్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ విధానం వల్ల పాస్పోర్టును అప్లికేషన్ సెంటర్లలో వదిలి వెళ్లాల్సిన అవసరం ఉండదు. అయితే బయోమెట్రిక్ నమోదు కోసం మాత్రం దరఖాస్తుదారులు ఫిజికల్గా సెంటర్లకు వెళ్లాల్సిందే. ఒకసారి 'ఈ-వీసా' పొందితే దాన్ని కోల్పోయే ప్రమాదం ఉండదు, దొంగతనానికి గురవ్వదు, ఎవరూ మార్చడానికి వీలుండదు. ఇది ప్రయాణికుల ఇమిగ్రేషన్ హక్కులను భద్రంగా, డిజిటల్ రూపంలో చూపుతుంది.
బోర్డింగ్లో నిబంధనలు కఠినం
ప్రయాణికుల వద్ద ఈ-వీసా, ఈటీఏ, ఇతర చెల్లుబాటు అయ్యే డిజిటల్ అనుమతులు లేకపోతే, విమానయాన సంస్థలు వారిని ప్రయాణానికి అనుమతించకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ ప్రయాణికుల వద్ద తగిన అనుమతులు లేకుంటే బోర్డింగ్ పాస్ను తిరస్కరించే అధికారం ఎయిర్లైన్స్కు ఉంటుంది. ఈ క్రమంలో ప్రయాణానికి ముందే అన్ని అనుమతులు సిద్ధం చేసుకోవాలని బ్రిటన్ వలస, పౌరసత్వ శాఖ మంత్రి మైక్ టాప్ సూచించారు. ప్రయాణికులు తమ యూకేవీఐ ఖాతాను ఎప్పటికప్పుడు తాజా పాస్పోర్ట్ వివరాలతో అప్డేట్గా ఉంచుకోవాలని, లేనిపక్షంలో ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు.
అమెరికా, యూరప్ దేశాలకూ వర్తింపు
కేవలం వీసా అవసరమైన వారికే కాకుండా అమెరికా, కెనడా, ఫ్రాన్స్ వంటి 85 దేశాల పౌరులకు కూడా 'ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్' తప్పనిసరి చేశారు. ఈటీఏ కోసం 16 పౌండ్ల రుసుము వసూలు చేస్తారు. ఇది రెండు ఏళ్ల పాటు లేదా పాస్పోర్ట్ గడువు ముగిసే వరకు (ఏది ముందు అయితే అది) చెల్లుబాటు అవుతుంది. ఇది బహుళ ప్రయాణాలకు అనుమతినిస్తుంది. బ్రిటన్ సరిహద్దు భద్రతను బలోపేతం చేయడమే ఈ విధానం ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.
ప్రయాణికులకు సూచనలు
బ్రిటన్ ప్రయాణానికి సిద్ధమవుతున్న వారు ప్రయాణానికి కనీసం మూడు రోజుల ముందే 'యూకే ఈటీఏ' యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం; దీనివల్ల సాంకేతిక కారణాలతో ఏదైనా అదనపు పరిశీలన అవసరమైతే సమయానికి పని పూర్తవుతుంది. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా వ్యక్తిగత వివరాలతో పాటు బయోమెట్రిక్ సమాచారం, నేర చరిత్రకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. చాలామందికి ఈ ప్రక్రియ నిమిషాల్లోనే పూర్తయి అనుమతి లభిస్తోంది.
'డిజిటల్ వీసా' విధానం వల్ల భవిష్యత్తులో సరిహద్దుల్లో కాంటాక్ట్లెస్ వెరిఫికేషన్కు మార్గం సుగమమవుతుందని బ్రిటన్ హోం శాఖ పేర్కొంది. అక్టోబర్ 2023 నుంచి ఇప్పటివరకు 19 మిలియన్లకు పైగా ప్రజలు ఈటీఏ ద్వారా లబ్ధి పొందారని, తద్వారా 383 మిలియన్ పౌండ్ల ఆదాయం వచ్చిందని ప్రభుత్వం వివరించింది.
