
పులి గోర్లు, దంతాల అక్రమ రవాణా ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ డీఆర్ఐ
హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో వన్యప్రాణుల అవయవాలను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు దాడి చేశారు. ఈ ఆపరేషన్లో ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 7 పులి గోర్లు, మూడు పులి కేనైన్ పళ్లను స్వాధీనం చేసుకున్నారు.
వన్యప్రాణుల అవయవాలను గ్రే మార్కెట్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో, డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ ఫిబ్రవరి 9న ఈ ఆపరేషన్ను చేపట్టింది. నాంపల్లి పరిసరాల్లో నిఘా ఉంచిన అధికారులు, అనుమానిత ఇద్దరు వ్యక్తులను చాకచక్యంగా అడ్డుకున్నారు. వారిని విచారించగా, ఒక వ్యక్తి తన బ్యాక్ప్యాక్ నుంచి జిప్-లాక్ కవర్ను బయటకు తీశాడు. దాన్ని పరీక్షించగా అందులో పులికి సంబంధించినవిగా భావిస్తున్న గోర్లు, కేనైన్ పళ్లు లభ్యమయ్యాయి.
వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972 నిబంధనల ప్రకారం ఆ అవయవాలను, వాటిని దాచిన బ్యాగును నిందితులు వాడిన మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లతో పాటు స్వాధీనం చేసుకున్న సామాగ్రిని తదుపరి విచారణ నిమిత్తం తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు అప్పగించినట్లు డీఆర్ఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవయవాలను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? దీని వెనుక ఉన్న పెద్ద ముఠా ఎవరనే కోణంలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
