
పీకే సలహా ఖరీదు రూ.11 కోట్లు
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. "నేను ఒక రెండు గంటల పాటు సలహా ఇచ్చినందుకు రూ.11 కోట్లు తీసుకున్నాను. ఇదీ.. ఈ బీహార్ కుర్రాడి సత్తా" అని ఆయన అన్నారు. డొల్ల కంపెనీల ద్వారా తన పార్టీకి విరాళాలు వస్తున్నాయన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. వృత్తిపరమైన ఫీజుల ద్వారానే తాను నిధులు సమకూర్చుకున్నానని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. జీఎస్టీ, ఆదాయపు పన్ను చెల్లించి తన సొమ్మును పార్టీకి విరాళంగా ఇచ్చానని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. 1995లో ఒక హత్య కేసులో ఆయనను దోషిగా తేలారని, ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అప్పట్లో తాను మైనర్ను అంటూ తప్పుడు పత్రాలు సమర్పించడం ద్వారా ఆయన శిక్ష నుండి తప్పించుకున్నారని ఆరోపించారు. పదో తరగతి కూడా పూర్తి చేయని సామ్రాట్ చౌదరి డిగ్రీ పట్టా పొందడం ఆశ్చరం కలిగిస్తోందని ఆయన అన్నారు. ప్రజలంతా తమ పిల్లలను ఎలా చూసుకోవాలో లాలూప్రసాద్ యాదవ్ను చూసి నేర్చుకోవాలని అన్నారు. ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ తొమ్మిదో తరగతి కూడా పాస్ కాలేదని, కానీ బీహార్కు రాజును చేయాలని లాలూ ప్రసాద్ ఉబలాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. సామాన్యుల పిల్లలు గ్రాడ్యుయేట్ చేసినా వారికి ఉద్యోగాలు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
