Let's talk: editor@tmv.in
పీఎంఏవైలో మోసం:చార్జీషీటుకు ఈడీ రెడీ

పీఎంఏవైలో మోసం:చార్జీషీటుకు ఈడీ రెడీ

Pinjari Chand
8 డిసెంబర్, 2025

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)లో అక్రమాలు, ఇంటి కొనుగోలుదారులను మోసం చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) త్వరలోనే గురుగ్రామ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ‘ఓషన్ సెవెన్ బిల్డ్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్’ ను, దాని ప్రమోటర్లపై ఛార్జిషీట్ దాఖలు చేయనుంది.

కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ఈ కేసులో కీలక వ్యక్తి అయిన స్వరాజ్ సింగ్ యాదవ్‌ను ఈడీ నవంబర్ 13న అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. ఈడీ ఆరోపణల ప్రకారం యాదవ్ పీఎంఏవై కింద సేకరించిన ఇంటి కొనుగోలుదారుల డబ్బును (రూ.222 కోట్లు) మోసపూరితంగా మళ్లించి, మనీలాండరింగ్ చేశారు. ఫ్లాట్లను రద్దు చేసి అధిక ధరలకు మళ్లీ అమ్మడం, భారీ మొత్తంలో నగదు ప్రీమియం వసూలు చేయడం, ఎస్క్రో ఖాతాల నుంచి డబ్బును షెల్ (డమ్మీ) కంపెనీలకు మళ్లించడం ద్వారా ఈ మోసం జరిగిందని ఈడీ తెలిపింది.

పీఎంఏవై ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇళ్లు అందించే కేంద్ర ప్రభుత్వ పథకం కాగా, దీన్ని దుర్వినియోగం చేశారని ఈడీ ఆరోపిస్తోంది. కంపెనీ, ప్రమోటర్ల ఆస్తుల విలువ నిర్ణయ ప్రక్రియ జరుగుతోంది. వీటిని పీఎంఎల్ఏ చట్టం కింద జప్తు చేసి, మోసపోయిన బాధితులకు తిరిగి ఇవ్వడానికి చర్యలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. యాదవ్ ఇటీవల గురుగ్రామ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో వ్యక్తిగత, కంపెనీ ఆస్తులను త్వరితగతిన అమ్మేసినట్లు ఈడీ గుర్తించింది. ఇది అక్రమ ఆదాయాన్ని సులభంగా ఖర్చు చేయగలిగే రూపంలోకి మార్చే ప్రయత్నం అని ఈడీ వాదించింది. యాదవ్ భార్య సునీతా స్వరాజ్ గత ఆగస్టులో అమెరికాకు వెళ్లి, ప్రస్తుతం మసాచుసెట్స్‌లోని హార్వర్డ్ యూనివర్శిటీలో నివసిస్తున్నట్లు తేలింది. ఆయన కుమారుడు, కుమార్తె కనెక్టికట్‌లోని ట్రినిటీ కాలేజీలో చదువుతున్నారు.

మోసం ఎలా జరిగింది?

పీఎంఏవై కింద రూ.26.5 లక్షల ధర ఉన్న ఫ్లాట్‌ను చెల్లించలేదు అనే తప్పుడు కారణం చూపి రద్దు చేసి, రూ.40–50 లక్షలకు మళ్లీ అమ్మారు.

ముందు కొనుగోలుదారుడికి డబ్బు తిరిగి ఇవ్వకుండానే రెండో వ్యక్తి నుంచి పూర్తి మొత్తం వసూలు చేశారు. ఇలా ఒకే ఫ్లాట్‌పై రెండు సార్లు డబ్బు సేకరించారు.

పార్కింగ్ స్థలాల అమ్మకంలోనూ చాలా తక్కువ మొత్తం బ్యాంకు ద్వారా చూపించి, మిగిలిన ప్రీమియంను నగదుగా తీసుకున్నారు.

భార్య పేరిట అమెరికాలో తెరిచిన బ్యాంకు ఖాతాకు హవాలా ద్వారా భారీ మొత్తంలో డబ్బు పంపారు.

యాదవ్ న్యాయవాదులు నవంబర్‌లో ఢిల్లీ కోర్టులో ఈ కేసుకు ఆధారమైన చాలా ఎఫ్‌ఐఆర్‌లు సెటిల్ అయినవే అని వాదించారు. అయినా పటియాలా హౌస్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి శేఫాలీ బర్నాలా టాండన్ యాదవ్ అరెస్టును కొట్టివేసే పిటిషన్‌ను తిరస్కరించి, నవంబర్ 14న ఈడీ కస్టడీకి 14 రోజుల పాటు అప్పగించారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కంపెనీ తరపు నుంచి ఈడీ ఆరోపణలపై ఇంతవరకు స్పందన రాలేదు.

కేసు పూర్వ పరాలు

ఓషన్ సెవెన్ బిల్డ్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గురుగ్రామ్‌లోని ఎక్స్‌ప్రెస్‌వే టవర్స్ ప్రాజెక్ట్‌లో మొత్తం 1,089 ఫ్లాట్లు అమ్మారు. ఈ ప్రాజెక్ట్ 7.5 ఎకరాల్లో 1బీహెచ్ కే 2బీహెచ్ కే ఫ్లాట్లతో 2016 డిసెంబర్‌లో ప్రారంభమైంది. ఈ కంపెనీ రూ.217 కోట్లు (కొనుగోలుదారుల చెల్లింపులలో 95శాతం పైనే) సేకరించినప్పటికీ, ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. 2022లో పట్టాను ఇస్తామని హామీ ఇచ్చినా ఇవ్వలేదు.

ఈడీ దర్యాప్తులో తేలిన వివరాలు

ఈ ఫ్లాట్లలో చాలా (కొన్ని వేల సంఖ్యలో బాధితులు) పీఎంఏవై అలాట్‌మెంట్లు తప్పుడు కారణాలతో (చెల్లింపు లేకపోవడం) రద్దు చేసి, అధిక ధరలకు (రూ.40-50 లక్షలు) మళ్లీ అమ్మారు. ముందు కొనుగోలుదారులకు డబ్బు తిరిగి ఇవ్వకుండా రెండోసారి వసూలు చేసి, మొత్తం రూ.222 కోట్ల మోసం జరిగింది. మొత్తం అమ్మిన ఇళ్ల సంఖ్య 1,089కి పరిమితమే, కానీ మోసం గురించి ఖచ్చితమైన రద్దు/తిరిగి ఎన్ని అమ్మారనే సంఖ్య ఈడీ ఛార్జ్‌షీట్‌లో తేలనుంది.

పీఎంఏవైలో మోసం:చార్జీషీటుకు ఈడీ రెడీ - Tholi Paluku