Let's talk: editor@tmv.in
పార్టీల్లో చేరుతున్న స్వతంత్రులు.. నిజామాబాద్‌లో ప్రతిపక్షానికే బీజేపీ మొగ్గు!

పార్టీల్లో చేరుతున్న స్వతంత్రులు.. నిజామాబాద్‌లో ప్రతిపక్షానికే బీజేపీ మొగ్గు!

Gaddamidi Naveen
15 ఫిబ్రవరి, 2026

తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్ పీఠాలను దక్కించుకునే విషయంలో రాజకీయ సమీకరణాలు తుది దశకు చేరుకున్నాయి. కరీంనగర్‌లో స్వతంత్రుల మద్దతుతో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం దాదాపు ఖాయం కాగా, నిజామాబాద్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రతిపక్షంలో కూర్చోవాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. మరోవైపు కొత్తగూడెంలో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

కరీంనగర్ కార్పొరేషన్‌లోని మొత్తం మొత్తం 66 వార్డుల్లో బీజేపీ 30 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 3 స్థానాలు గెలుచుకోగా, స్వతంత్రులు 7 స్థానాలు సాధించారు. శనివారం ముగ్గురు స్వతంత్ర కార్పొరేటర్లు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన ఒక కార్పొరేటర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి బీజేపీకి మద్దతు ప్రకటించారు. మరో ఆరుగురు కార్పొరేటర్లు కూడా బీజేపీతో చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎక్స్‌ఆఫిషియో సభ్యుడిగా బండి సంజయ్‌కు ఓటు హక్కు ఉండటం కూడా బీజేపీకి అనుకూలంగా మారింది. ఇప్పటికే పార్టీ బలం 35కి చేరడంతో కరీంనగర్‌లో మేయర్ పదవి బీజేపీ ఖాయం అవుతుందని భావిస్తున్నారు.

ఇక నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచినా, ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయించింది. మొత్తం 60 వార్డుల్లో బీజేపీ 28 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య అనైతిక పొత్తు ఉందని ఆరోపిస్తూ బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అదే సమయంలో కొత్తగూడెం కార్పొరేషన్‌లో అధికారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 60 సభ్యులున్న ఈ కార్పొరేషన్‌లో కాంగ్రెస్, సీపీఐ చెరో 22 వార్డులు గెలుచుకున్నాయి. స్వతంత్రులు 6, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సీపీఎం 1 స్థానాన్ని సాధించాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సింగరేణి సంస్థలో జరిగిన అక్రమాలపై కలిసి పోరాడేందుకు సీపీఐకి మద్దతు ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించారు. కొత్తగూడెంలో సింగరేణి కాలరీస్ ప్రాధాన్యం ఎక్కువగా ఉండటం రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేస్తోంది. అయితే కాంగ్రెస్, సీపీఐ ముందస్తు పొత్తు కారణంగా ఇరు పార్టీలు అవగాహనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

మిగిలిన నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లైన నల్గొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్‌నగర్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టనుంది. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నికలు ఫిబ్రవరి 16న నిర్వహించబడనున్నాయి. దీంతో తెలంగాణలో మున్సిపల్ రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి.