
పాకిస్థాన్ పౌరసత్వాన్ని దాచి ప్రభుత్వ ఉద్యోగం పొందిన మహిళపై కేసు నమోదు
పాకిస్థాన్ పౌరసత్వాన్ని దాచిపెట్టి నకిలీ పత్రాల సహాయంతో ప్రాథమిక విద్యాశాఖలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం పొందిన మహిళపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అజీంనగర్ పోలీస్ స్టేషన్లో ప్రాథమిక విద్యాశాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. అంతర్గత విచారణలో మహీరా అక్తర్ అలియాస్ ఫర్జానా నకిలీ పత్రాలు ఉపయోగించి ఉద్యోగం పొందినట్లు బయటపడినట్టు అధికారులు చెప్పారు. అదనపు పోలీస్ సూపరింటెండెంట్ అనురాగ్ సింగ్ మాట్లాడుతూ, నిందితురాలు కుమ్హారియా గ్రామంలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసినట్లు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్లు 318(4), 336, 338, 340 ప్రకారం మోసం, ఫోర్జరీ ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. పాకిస్థాన్ పౌరురాలైనా, నకిలీ నివాస ధ్రువపత్రం ఉపయోగించి విద్యాశాఖలో ఉద్యోగం పొందిందన్నది ఆరోపణ అని ఆయన చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం, ఆ మహిళ 1979లో పాకిస్థాన్ పౌరుడిని వివాహం చేసుకుని అనంతరం పాకిస్థాన్ పౌరసత్వం పొందింది. విడాకుల తర్వాత పాకిస్థాన్ పాస్పోర్టుతో భారత్కు వచ్చి, సుమారు 1985లో స్థానిక వ్యక్తిని వివాహం చేసుకుంది. అదే సమయంలో తాను భారత పౌరురాలినని చూపిస్తూ ప్రాథమిక విద్యాశాఖలో ఉద్యోగం పొందినట్లు విచారణలో తేలింది. ఆమె పాకిస్థాన్ పౌరసత్వం వెలుగులోకి రావడంతో విద్యాశాఖ ముందుగా ఆమెను సస్పెండ్ చేసి, ఆ తర్వాత ఉద్యోగం నుంచి తొలగించింది. శాఖ నివేదిక ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, ఆధారాలు సేకరిస్తున్నామని అదనపు ఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదని చెప్పారు.
