Let's talk: editor@tmv.in
పశ్చిమాసియా ఘర్షణలో ‘ఐదుగురు భారతీయులు మృతి, ఒకరు గల్లంతు’

పశ్చిమాసియా ఘర్షణలో ‘ఐదుగురు భారతీయులు మృతి, ఒకరు గల్లంతు’

Dantu Vijaya Lakshmi Prasanna
15 మార్చి, 2026

పశ్చిమా సియాలో కొనసాగుతున్న ఘర్షణలో ఇప్పటివరకు ఐదుగురు భారతీయులు మరణించారని, ఒకరు గాయపడ్డారని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి (గల్ఫ్) అసీం మహాజన్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాయబార కార్యాలయాలు 24 గంటలు తెరిచి ఉండి సహాయక చర్యల్లో నిరంతరం పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. నగరంలో జరిగిన తాజా పరిణామాలపై నిర్వహించిన అంతర్-మంత్రిత్వ శాఖ సమావేశంలో మహాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మహాజన్ మాట్లాడుతూ, “ముందు జరిగిన ఘటనలో ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు, ఒకరు గల్లంతయ్యారు. ఒమాన్, ఇరాక్, యుఏఈలోని మా రాయబార కార్యాలయాలు గల్లంతైన భారతీయుడి గురించి సంబంధిత అధికారులతో నిరంతర సంప్రదింపులో ఉన్నాయి. అలాగే మరణించిన వారి మృతదేహాలను అవసరమైన ప్రక్రియలు పూర్తయ్యిన వెంటనే భారత్‌కు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నాం,” అని తెలిపారు.

ఆ ప్రాంతంలో ఉన్న నావికులకు పూర్తి సహాయం అందిస్తున్నామని, పోర్ట్స్, షిప్పింగ్ మంత్రిత్వ శాఖతో విదేశాంగ శాఖ సన్నిహితంగా సమన్వయం చేస్తోందని ఆయన తెలిపారు. బహ్రెయిన్, కువైట్ వంటి దేశాల నుంచి నేరుగా విమాన సర్వీసులు లేకపోవడంతో, భారత పౌరులకు వీసా పొడిగింపులు, ట్రాన్సిట్ వీసాల ద్వారా సౌదీ అరేబియా మీదుగా భారత్‌కు చేరుకునేలా సహాయం అందిస్తున్నామని చెప్పారు.

ఒమాన్‌లోని సొహార్ నగరంలో జరిగిన దాడి గురించి మాట్లాడుతూ, ఆ ఘటనలో ఇద్దరు భారతీయులు మరణించారని, 10 మంది గాయపడ్డారని తెలిపారు. వారిలో ఎవరూ తీవ్రంగా గాయపడలేదని ఆయన చెప్పారు.

“మా రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో, స్థానిక కంపెనీలతో, ఆసుపత్రులతో, బాధితుల కుటుంబాలతో నిరంతరం సంప్రదింపులో ఉంది. మరణించిన ఇద్దరి మృతదేహాలను త్వరగా భారత్‌కు పంపించేందుకు చర్యలు తీసుకుంటోంది,” అని ఆయన పేర్కొన్నారు.

సేఫ్‌సీ విష్ణు ఘటన గురించి మాట్లాడుతూ, ఇరాక్‌లోని బస్రా నగరంలో హోటల్‌లో ఉన్న 15 మంది సిబ్బందిని సురక్షితంగా తరలించినట్టు తెలిపారు. వారిని భారత్‌కు త్వరగా పంపించేందుకు అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు.

పశ్చిమాసియా ఘర్షణలో ‘ఐదుగురు భారతీయులు మృతి, ఒకరు గల్లంతు’ - Tholi Paluku