
పశ్చిమాసియాలో విధ్వంసం బహిర్గతం: ఉపగ్రహ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు
ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్ యుద్ధం మధ్యప్రాచ్య ప్రాంతంలో విస్తృత స్థాయిలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నట్లు తాజాగా వెలుగులోకి వస్తున్న ఉపగ్రహ చిత్రాలు స్పష్టంచేస్తున్నాయి. ఇప్పటివరకు ఈ యుద్ధానికి సంబంధించిన సమాచారం చాలా వరకు పరిమితంగానే ఉండగా, ఇప్పుడు విడుదలవుతున్న చిత్రాలు భౌతిక నష్టం తీవ్రతను ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా సైనిక స్థావరాలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు వంటి కీలక ప్రాంతాలు భారీ దాడులకు గురైనట్లు కనిపిస్తోంది.
ఈ చిత్రాలను అమెరికాకు చెందిన ప్లానేట్ లాబ్స్ పీబీసీ సంస్థ విడుదల చేస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ సంస్థ తన చిత్రాలను రెండు వారాల ఆలస్యంతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఆలస్యం వల్ల యుద్ధ సమయంలో తక్షణ వ్యూహాత్మక ప్రయోజనాలు పొందకుండా నిరోధించవచ్చని సంస్థ పేర్కొంది. ఇదే సమయంలో ఇతర ప్రైవేట్ సంస్థలు కూడా హై రిజల్యూషన్ చిత్రాలను అందిస్తున్నాయి. అలాగే అమెరికా జియోలాజికల్ సర్వే వంటి సంస్థలు తక్కువ స్పష్టత ఉన్న చిత్రాల ద్వారా అగ్నిప్రమాదాలు, పేలుళ్లను గుర్తిస్తున్నాయి.
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై విస్తృత స్థాయిలో దాడులు కొనసాగిస్తున్నాయి. ఇందులో సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలు, గాలి రక్షణ వ్యవస్థలు, అలాగే రివల్యూషనరీ గార్డ్కు చెందిన స్థావరాలు ఉన్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలపై ప్రతిదాడులు చేస్తోంది.
బందర్ అబ్బాస్ పోర్టులో మంటల్లో నౌకలు
ఇరాన్లోని ముఖ్యమైన నౌకాశ్రయ నగరం బందర్ అబ్బాస్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా కనిపిస్తోంది. మార్చి 2న తీసిన ఉపగ్రహ చిత్రాల్లో అక్కడ నిలిపివుంచిన నౌకలు మంటల్లో కాలిపోతున్నట్లు కనిపించింది. ఈ పోర్ట్ హోర్ముజ్ జలసంధికి సమీపంలో ఉండటం వల్ల వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్కు చెందిన 100కు పైగా నౌకలు దెబ్బతిన్నాయని లేదా మునిగిపోయాయని చెబుతోంది.
పార్చిన్ సైనిక స్థావరం లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు
మార్చి 6న తీసిన చిత్రాల్లో పార్చిన్లో గణనీయమైన నష్టం కనిపించింది. ఈ ప్రాంతం గతంలో అణు ఆయుధ పరీక్షలకు సంబంధించి అనుమానిత స్థావరంగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ ఈ ప్రాంతంపై గతంలో అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం, ఈ దాడుల్లో ఆయుధ తయారీకి అవసరమైన కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్నారు.
బహ్రెయిన్లో అమెరికా 5వ నౌకాదళ కేంద్రం దెబ్బతినడం
గల్ఫ్ ప్రాంతంలో కీలకమైన అమెరికా సైనిక స్థావరం బహ్రెయిన్ లో ఉంది. అక్కడి 5వ నౌకాదళ ప్రధాన కేంద్రంపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు జరిగాయని ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. మార్చి 1న తీసిన చిత్రాల్లో ఒక పెద్ద భవనం పూర్తిగా ధ్వంసమైందని, రెండు రాడార్ గోపురాలు కూలిపోయాయని కనిపించింది. ఈ దాడులు అమెరికా రక్షణ వ్యవస్థలపై గణనీయమైన ప్రభావాన్ని చూపినట్లు అంచనా.
యూఏఈలో అల్ ధఫ్రా ఎయిర్ బేస్పై దాడులు
మార్చి 15న తీసిన చిత్రాల్లో అబుదాబిలోని ఏఐ ధఫ్రా ఎయిర్ బేస్లో గణనీయమైన నష్టం బయటపడింది. హ్యాంగర్లు పూర్తిగా కాలిపోయినట్లు, మరికొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. ఈ స్థావరం అమెరికా సైన్యానికి కీలక కేంద్రంగా పనిచేస్తోంది. ఇక్కడ నుంచి డ్రోన్లు, ఫైటర్ జెట్లు కార్యకలాపాలు నిర్వహిస్తాయి.
అబుదాబిలోని క్యాంప్ డే లా పైక్స్ అనే ఫ్రెంచ్ నౌకాదళ స్థావరం కూడా దాడులకు గురైనట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. మార్చి 3న తీసిన చిత్రాల్లో రెండు పెద్ద భవనాలు దెబ్బతిన్నట్లు కనిపించింది. ఈ స్థావరం జాయెద్ పోర్ట్ సమీపంలో ఉండటం వల్ల అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగి ఉంది.
విమానాశ్రయాలు, పోర్టుల వద్ద అగ్నిప్రమాదాలు
అమెరికా జియోలాజికల్ సర్వే ఉపగ్రహాలు గుర్తించిన ప్రకారం, దుబాయి ఇంటర్నేషనల్ పోర్ట్ వద్ద డ్రోన్ దాడి కారణంగా ఇంధన ట్యాంకర్ మంటల్లో కాలిపోయింది. దీని వల్ల భారీగా నల్లటి పొగ వ్యాపించింది. ఇది ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఒకటి కావడం గమనార్హం.
అదే విధంగా ఒమాన్లోని సలాలా పోర్టులో కూడా అగ్నిప్రమాదం నమోదైంది. మార్చి 11న జరిగిన డ్రోన్ దాడి కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని అనుమానాలు ఉన్నప్పటికీ, ఇరాన్ దీనిని ఖండించింది.
మొత్తం మీద, ఈ ఉపగ్రహ చిత్రాలు యుద్ధం ఎంత తీవ్రంగా కొనసాగుతుందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా సైనిక స్థావరాలు, నౌకాశ్రయాలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు లక్ష్యంగా మారడం ఈ యుద్ధం విస్తృత స్థాయిలో వ్యాపించిందని సూచిస్తోంది. భద్రతా పరిమితుల కారణంగా ఇప్పటికీ పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో లేకపోయినా, వెలుగులోకి వస్తున్న ప్రతి చిత్రం యుద్ధం ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది.
