
పర్యటనల్ని వాయిదా వేసిన విజయ్
తమిళవెట్రి కళగం(టీవీకే)పార్టీ తన ప్రచార ర్యాలీలను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. కరూర్ తొక్కిసలాట ఘటన తరువాత పార్టీ చీఫ్,నటుడు విజయ్ పార్టీ ముఖ్యులతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 27 నజరిగిన పెను విషాదంలో దాదాపు 41 మంది మరణించారు. 90 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే ఈ అనుహ్య నిర్ణయం తీసుకుంది. ‘మా ప్రియమైన ప్రజలను కోల్పోయినందుకు మేం చాలా దు:ఖంలో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో 14 రోజుల పాటు పార్టీ ప్రచార ర్యాలీలను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని, మా నాయకుడి నిర్ణయాలను ప్రతినిత్యం మీతో పంచుకుంటామని ఎక్స్ లో టీవీకే పోస్ట్ చేసింది.
అలాగే త్వరలోనే బాధితులను కలుస్తానని, నా జీవితంలో ఇంతటి విషాదాన్ని ఎప్పుడు చూడలేదని, బాధని అనుభవించలేదని విజయ్ అన్నారు. నన్ను చూడడానికి వచ్చి మీరుప్రాణాలు పొగొట్టుకోవడం నన్ను కలచి వేస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సంఘటన జరిగిన తరువాత మీ వెంట లేకపోవడానికి కారణం.మళ్లీ నేను వస్తే ఇబ్బందులు ఎదురవుతాయనేనని తెలిపారు. తొక్కిసలాట ఘటనలో పార్టీ కరూర్ జిల్లా కార్యదర్శి మతియాజగన్, పట్టణ కార్యకర్త అయిన పౌన్ రాజ్ లను పోలీసులు అరెస్ట్ చేసి అక్టోబర్ 14 వరకు జ్యూడిషియల్ కస్టడీకి పంపారు.
