Let's talk: editor@tmv.in
ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానం విశాఖ

ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానం విశాఖ

FL - YUGDR
21 సెప్టెంబర్, 2025

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, ఇది ఎగుమతుల్లో దాదాపు 45 శాతం వాటాను కలిగి 11 కోట్ల మందికి పైగా ఉద్యోగాలను కల్పిస్తూ జిడిపిలో సుమారు 30 శాతం వాటాను కలిగి ఉందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఫిక్కీ సెంటర్ ఫర్ సస్టైనబిలిటీ లీడర్‌షిప్, విశాఖపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్తంగా పర్యావరణ, సామాజిక పాలన సూత్రాలు, ఎంఎస్‌ఎంఈల సుస్థిర వృద్ధి అనే అంశంపై విశాఖపట్నంలోని ప్రముఖ హోటల్ సమావేశ మందిరంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ, సామాజిక పాలన సూత్రాలు ఎంఎస్‌ఎంఈ కార్యకలాపాల్లో చేర్చడం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ మార్పు పోటీతత్వాన్ని పెంచడానికి, స్థిరత్వాన్ని సాధించడానికి, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. జిఎస్టి హేతుబద్ధీకరణతో సహా జాతీయ స్థాయిలో ఇటీవల చేపట్టిన సంస్కరణలను ఆయన ప్రశంసించారు. ఇవి ఎంఎస్‌ఎంఈలకు, మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగించడంతో పాటు, పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహిస్తాయని ఆయన తెలిపారు.

వ్యాపార సౌలభ్యం కోసం వ్యవస్థలను పునర్నిర్మించడం, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టితో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి కల్పన, కార్యకలాపాల వ్యయాన్ని తగ్గించడం వంటివి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టిలో ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. బంగారం, ఫార్మాస్యూటికల్స్, వస్త్ర పరిశ్రమల కోసం క్లస్టర్-ఆధారిత కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయడం, విశ్వవిద్యాలయాలు, ఆర్థిక సంస్థలు, వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రభుత్వ సంస్థలను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో అనుసంధానించడం ద్వారా ఒక అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. తయారీ రంగంలో స్వచ్ఛమైన, గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించడం, ముఖ్యమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం వంటి ప్రతిపాదిత కార్యక్రమాలకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇవి ప్రస్తుతానికి చిన్న స్థాయి వ్యాపారాలను ప్రోత్సహించడానికి పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రోత్సాహక అధికారులను నియమిస్తామని జిల్లాల స్థాయిలో ఛాంబర్ ఆఫ్ కామర్సులు ఏర్పాటు చేయబడతాయని, దీనితో ఎంఎస్‌ఎంఈలకు చివరి స్థాయి వరకు మద్దతు, చేయూత, సమర్థవంతమైన పంపిణీ కల్పించబడతాయని మంత్రి తెలిపారు. జిసిసి సమ్మిట్, ఇండియా ఇ-గవర్నెన్స్ సమ్మిట్, గ్లోబల్ పార్టనర్‌షిప్ సమ్మిట్ వంటి ప్రధాన అంతర్జాతీయ, జాతీయ కార్యక్రమాలు విశాఖ నగరంలో జరగనున్నాయని ఆయన తెలిపారు. ఉద్యోగ కల్పన, స్టార్టప్‌ల ప్రోత్సాహం, పారిశ్రామిక ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగిస్తుందని, తద్వారా రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంను ఒక ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టడానికి కట్టుబడి ఉందని తెలిపారు. సుస్థిరమైన, ప్రపంచ స్థాయిలో పోటీపడే సంస్థలుగా ఎదగడానికి వీలు కలుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు.

ఎపీఎంఎస్‌ఎంఈడీసీ ఛైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, పారిశ్రామిక కాలుష్యం, వ్యర్థ జలాల శుద్ధి, పురుగుమందుల అవశేషాలు వంటి పర్యావరణ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సవాళ్ళు అంతర్జాతీయ వాణిజ్యం, మార్కెట్ పోటీతత్వంలో నిర్ణయాత్మక అంశాలుగా మారాయని ఆయన తెలిపారు. నాణ్యత, నిబంధనల లోపాలతో భారతీయ ఎగుమతులు అంతర్జాతీయ మార్కెట్లలో తిరస్కరణకు గురైన సందర్భాలు ఉన్నాయని, కాబట్టి ఎంఎస్‌ఎంఈలు సుస్థిర విధానాలను అవలంబించడం అత్యవసరమని ఆయన వివరించారు. సుస్థిరత అంటే పర్యావరణ పరిరక్షణకే పరిమితం కాదని, సామాజిక బాధ్యత, సంస్థలు, సంఘాలు, ప్రపంచ కొనుగోలుదారుల మధ్య నమ్మకాన్ని బలోపేతం చేయడం కూడా ఇందులో భాగమని ఆయన పేర్కొన్నారు. ఒక కుటుంబం ఒక వ్యవస్థాపకుడు అనే లక్ష్యంతో, వ్యవస్థాపకత, స్థిరమైన పారిశ్రామిక వృద్ధి, ఉద్యోగ కల్పనను ప్రోత్సహించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టిని తెలియజేస్తుందన్నారు. ఆర్థిక సంస్థలు ఎంఎస్‌ఎంఈలకు మరింత సహకారాన్ని అందించాలని ఆయన పిలుపునిచ్చారు. సరైన సమయంలో ఆర్థిక సహాయం పోటీతత్వం, ఉపాధి కల్పన, ఆర్థిక అభివృద్ధికి చాలా కీలకమని ఆయన నొక్కి చెప్పారు.

ఈ కార్యక్రమంలో విసిసిఐ అధ్యక్షులు సుదర్శన స్వామి, కేంద్ర ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ అసిస్టెంట్ డైరక్టర్ కె శివరాం ప్రసాద్, సెంట్రల్ బ్యాంక్ డిజియం ఏవి రమణ మూర్తి, జె యస్ డబ్లు పారిశ్రామిక పార్క్ బిజినెస్ ఆఫీసర్ రాజారాం పాయ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానం విశాఖ - Tholi Paluku