
పత్తి రైతుల ఇబ్బందులు నివారించాలంటూ కేంద్రాన్ని కోరిన మంత్రి అచ్చెన్నాయుడు
రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని, వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, మార్కెటింగ్, పాల మత్స్య శాఖల మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర టెక్స్టైల్ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ కి లేఖ రాశారు. 2025–26 ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరగగా, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని తెలిపారు. అయితే మొంథా తుఫాన్ ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరలకు పత్తిని విక్రయించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎం యాప్ ఆధార్ ఆధారిత ఈ పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు పూర్తిగా డిజిటలైజ్ చేయబడిన విధానంలో నిర్వహిస్తున్నదని, అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపాస్ కిసాన్ యాప్ ను రాష్ట్ర సీఎం యాప్ తో అనుసంధానం చేసిన తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
రైతుల సౌకర్యం కోసం పలు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరిన మంత్రి అచ్చెన్నాయుడు
• కాపాస్ కిసాన్ యాప్ నుండి సీఎం యాప్ కు రైతు వివరాలు రియల్ టైమ్లో సమన్వయం అయ్యేలా చేయాలి.
• రైతులు తమ సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లులలో పత్తి విక్రయించుకునే విధంగా మ్యాపింగ్ చేయాలి.
• ఎల్1, ఎల్2, ఎల్3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి.
• కాపాస్ కిసాన్ యాప్ (Kapas Kisan App) కోసం గుంటూరులో ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించాలి.
• వాతావరణ పరిస్థితుల కారణంగా తేమ శాతం 12 నుండి 18% వరకు ఉన్న పత్తిని కూడా అనుపాత తగ్గింపులతో కొనుగోలు చేయాలి.
• వర్షానికి తడిసిన లేదా రంగు మారిన పత్తిని కూడా తగిన ధర తగ్గింపులతో కొనుగోలు చేయాలి
ఈ చర్యలు రైతులలో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించి, పత్తి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని, సహజ విపత్తుతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్రం తక్షణ సహకారం అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు.
