
పిటిషన్ ఉపసంహరించుకోండి
పార్లమెంట్ పై దాడి చేసిన కేసులో అరెస్టై, తర్వాత ఉరి తీయబడ్డ అఫ్జల్ గురు, జేకేఎల్ఎఫ్ వ్యవస్థాపకుడైన మక్బూల్ భట్ ల సమాధులను తీహర్ జైలు నుంచి తొలగించాలన్న పిటిషన్ ను జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ గేదేల తుషార్ రావులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా విశ్వవేద సనాతన్ సంఘ్ ద్వారా పిటిషన్ వేసిన న్యాయవాది బరుణ్ సిన్హాకు బెంచ్ సూచిస్తూ పిటిషన్ ఉపసంహరించుకోండి లేదా సరైన ఆధారాలతో మళ్లీ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.
యాత్ర స్థలాలుగా మారాయి
తీహార్ జైలులోని నంబర్ 3 సమీపంలో ఉన్న వీరి సమాధులు కొన్ని తీవ్రవాద శక్తులకు తీర్థ యాత్ర స్థలాలుగా మారాయని, ఇది 2018 ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ చట్టాన్ని, జైళ్ల నియమాలను ఉల్లంఘిస్తోందని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ప్రజలు అక్కడికి వెళ్లి నివాళులర్పిస్తున్నట్లయితే అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోర్టు ఈ సందర్భంగా కోరింది. పన్నెండు సంవత్సరాల తర్వాత దీన్ని సవాల్ చేయవచ్చా? అని పిటిషనర్ ను జస్టిస్ ఉపాధ్యాయ ప్రశ్నించారు. అయితే వాదోపవాదాల తర్వాత న్యాయవాది సిన్హా పిటిషన్ ఉపసంహరించుకోవడానికి అనుమతి తీసుకుని, మళ్లీ అధారాలతో వేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో కోర్టు ప్రస్తుత పిటిషన్ ను కొట్టివేసింది.
తక్షణ జోక్యం చేసుకోవాలని డిమాండ్
తీహార్ సెంట్రల్ జైలులో ప్రాంగణంలో ఉన్న ఉగ్రవాదుల సమాధులు తొలగించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం కోర్టు తక్షణ జోక్యం చేసుకోవాలని పిటిషనర్ తరుపు న్యాయవాది కోరారు. ఉరితీసిన వారి సమాధులను సందర్శించకుండా చూడాలని, వెంటనే అక్కడి నుంచి తరలించాలని అడిగారు. అజ్మల్ కసబ్, యాకూబ్ మెమన్ లాంటి తీవ్రవాదుల విషయంలో ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకున్నట్లు ఆదేశించాలని పిటిషనర్లు కోరారు.
