
పంజాబ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తాం – అమిత్ షా
పంజాబ్లో డ్రగ్స్ సమస్యను పూర్తిగా నిర్మూలించగలిగేది కేవలం బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఒకసారి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. పంజాబ్లోని మోగా జిల్లాలో జరిగిన ‘బద్లావ్ ర్యాలీ’లో మాట్లాడిన షా, ప్రస్తుత ప్రభుత్వం వల్ల రాష్ట్రం అప్పులు, డ్రగ్స్, గ్యాంగ్స్టర్ భయం, అవినీతి వంటి సమస్యలతో నష్టపోయిందని విమర్శించారు. ఈ పరిస్థితిని మార్చగలిగేది ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీతో మాత్రమేనని ఆయన అన్నారు. పంజాబ్ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్, ఆమ్ఆద్మీ పార్టీలకు అనేక అవకాశాలు ఇచ్చారని, ఇప్పుడు బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
డ్రగ్స్పై 2 ఏళ్లలో చర్యలు
2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రెండు సంవత్సరాల్లోనే డ్రగ్ మాఫియాను పూర్తిగా నిర్మూలిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం, నక్సలిజం తగ్గించడం వంటి చర్యలను ఉదాహరణగా చూపుతూ అదే విధంగా పంజాబ్లో కూడా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. భగవంత్ మాన్ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందని, రాష్ట్ర సంపదను ఢిల్లీ నాయకులకు పంపిస్తున్నదని షా ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థ క్షీణించిందని, 2026లో ఇప్పటికే ముగ్గురు గ్రామ సర్పంచులు హత్యకు గురయ్యారని కూడా ఆయన పేర్కొన్నారు.
ఏటీఎంలా మారింది
ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వంపై కూడా షా విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కోసం పనిచేసే ‘ఏటీఎం’లా మారిందని ఆరోపించారు. 2027 ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా పోటీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యమని ఆయన చెప్పారు. గతంలో బీజేపీ పంజాబ్లో అకాలి దళ్తో కలిసి చిన్న భాగస్వామిగా అధికారంలో ఉండేదని, ఇప్పుడు మాత్రం ప్రజల ఆశీర్వాదంతో పూర్తి మెజారిటీ సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మోగా ప్రాంతం పంజాబ్ రాజకీయాల్లో కీలకమైన మాల్వా బెల్ట్లో భాగమని, ఈ ప్రాంతంలోనే రాష్ట్ర అసెంబ్లీకి చెందిన 117 సీట్లలో 69 సీట్లు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
