
పంచ సూత్రాలు కాదు, పంచ మోసాలు- షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతులకు సంక్షేమాన్ని అందించే బదులు, ఐదు ప్రధాన "మోసాలకు" పాల్పడిందని ఆరోపించారు.
గత 17 నెలల్లో వ్యవసాయ రంగంపై ప్రభుత్వ విధానాన్ని ఆమె విమర్శిస్తూ, వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేసి, సాగుదారులను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు ఇటీవల రైతన్నా .. మీకోసం కార్యక్రమం రూపొందించింది. దీనిలో పంచసూత్రాలు పొందుపరిచింది. ఏపి ప్రభుత్వం ప్రకారం, ఆ ఐదు సూత్రాల ఫార్ములా, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత సాగు, అగ్రి టెక్, ఫుడ్ ప్రాసెసింగ్, రైతులకు ప్రభుత్వ మద్దతు.
ఈ కార్యక్రమంపై షర్మిలా స్పందిస్తూ.. "సాగుకు ఐదు ఫార్ములాలు కాదు, ఐదు మోసాలు, చంద్రబాబు యొక్క 'ఐదు-ఫార్ములాల సంక్షేమం' పూర్తిగా బూటకం. 17 నెలలుగా వారు వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేశారు," రైతన్నలను అప్పుల పాలు చేశారు. సాగుకు సమాధి కట్టి.. అన్నదాతలకు మేలుకోసం పంచసూత్ర ప్రణాళిక అనేందుకు, రైతన్నా మీకోసం అంటూ అనడం, విస్తృత ప్రచారం అని డబ్బా కొట్టేందుకు కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలి అని షర్మిల 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
కూటమి ప్రభుత్వ 17 నెలల పంచ మోసాలు:
1.ప్రకృతి వైపరీత్యాలకు జరిగిన నష్టాన్ని ఎగ్గొట్టారు.
2 . ఏ పంటకు మద్దతుధర కల్పించకుండా మోసం చేశారు.
3 . అన్నదాత సుఖీభవ కింద సగం మంది రైతులకు పంగనామాలు పెట్టారు. ఇతర సబ్సిడీ పథకాలకు స్వస్థి చెప్పారు.
4 . టమాటా,ఉల్లి,అరటి లాంటి పంటలు రూ.1 రూపాయికి పడిపోయినా ధరల స్థిరీకరణ నిధి పెట్టకుండా మంగళం పాడారు.
5 .చివరకు ఎరువులు, విత్తనాలు ఇవ్వకుండా అప్పుల బాధతో రైతన్నలకు ఆత్మహత్యలే దిక్కని ప్రోత్సహించారని అన్నారు.
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చెప్పే "ఐదు-సూత్రాల ప్రణాళిక" కేవలం ప్రచార ఆర్భాటమేనని షర్మిల ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగిన వ్యవసాయ నష్టాలకు ప్రభుత్వం స్పందించడంలో విఫలమైందని, సహాయం కోసం రైతుల అత్యవసర విజ్ఞప్తులను పట్టించుకోలేదని ఆమె అన్నారు. గత 17 నెలల్లో ఏ పంటకూ కనీస మద్దతు ధర లేకపోవడాన్ని షర్మిల ఎత్తిచూపుతూ, సాగుదారులు హెచ్చుతగ్గులు ఉన్న మార్కెట్ ధరలకు వదిలివేయబడ్డారని షర్మిల అన్నారు.
