Let's talk: editor@tmv.in
న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలి : సీజేఐ సూర్యకాంత్

న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలి : సీజేఐ సూర్యకాంత్

Pinjari Chand
9 మార్చి, 2026

భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు మరిన్ని సంస్థాగత సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా హైకోర్టు కొలీజియంలు ప్రతిభావంతమైన మహిళా న్యాయవాదులను న్యాయమూర్తులుగా ఎంపిక చేయడాన్ని ‘విశేషం’గా కాకుండా సాధారణ విధానంగా తీసుకోవాలని ఆయన సూచించారు. న్యాయరంగంలో మహిళల ప్రాతినిధ్యం గురించి ఆదివారం నిర్వహించిన జాతీయ సదస్సులో ప్రసంగించిన సీజేఐ, మహిళలు ప్రత్యేక సౌకర్యాలు కోరుకోవడం లేదని, సమానమైన, తగిన ప్రాతినిధ్యాన్ని మాత్రమే కోరుకుంటున్నారని అన్నారు. న్యాయవృత్తి ఈ నిజాన్ని అంగీకరించినప్పుడే మహిళలు బెంచ్‌ వరకు చేరే మార్గం మరింత సులభమవుతుందని ఆయన తెలిపారు. సీజేఐ హైకోర్టు కొలీజియంలకు సూచిస్తూ, తమ రాష్ట్రాలకు చెందనప్పటికీ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న మహిళా న్యాయవాదులను కూడా న్యాయమూర్తుల పదవులకు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇది న్యాయవ్యవస్థలో న్యాయం, సమానత్వాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. ఈ మార్పులు ఒక్క వ్యక్తి కృషితో కాకుండా సంస్థాగతంగా అమలు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థలో సంస్కరణలు ఒకసారి జరిగే సంఘటన కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగాలని సీజేఐ పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలోని కొన్ని హైకోర్టుల్లో మహిళా ప్రధాన న్యాయమూర్తులు సేవలందిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అలాగే పంజాబ్, హార్యానా హైకోర్టులో 18 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని చెప్పారు. అదేవిధంగా మద్రాస్‌, ముంబై హైకోర్టుల్లో కూడా దాదాపు డజనుకు పైగా మహిళా న్యాయమూర్తులు ఉన్నారని తెలిపారు.

జిల్లా స్థాయి న్యాయవ్యవస్థలో మహిళల భాగస్వామ్యం మరింత ప్రోత్సాహకరంగా ఉందని సీజేఐ అన్నారు. ప్రస్తుతం జిల్లా న్యాయమూర్తులలో సుమారు 36.3 శాతం మహిళలు ఉన్నారని తెలిపారు. ఇది భవిష్యత్తులో ఉన్నత న్యాయస్థానాల్లో కూడా మహిళల సంఖ్య పెరుగుతుందని సూచిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. కాలానుగుణంగా న్యాయవృత్తిలో కొన్ని పని పరిస్థితులు మహిళలకు అదనపు భారంగా మారుతున్నాయని ఆయన చెప్పారు. రాత్రి వేళల సమావేశాలు, సరైన సౌకర్యాల లోపం, కార్యాలయాల్లో పక్షపాతం వంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ అడ్డంకులను అధిగమించి అనేక మంది మహిళలు న్యాయరంగంలో విజయవంతంగా ముందుకు వస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఒక మహిళ న్యాయమూర్తిగా నియమితులైనప్పుడల్లా, అదే మార్గంలో ముందుకు రావాలనుకునే మరెంతో మందికి అది ప్రేరణగా నిలుస్తుందని సీజేఐ సూర్యకాంత్ అన్నారు.