Let's talk: editor@tmv.in
నైరుతి నిష్క్రమణ.. ఈశాన్యం ఆగమనం

నైరుతి నిష్క్రమణ.. ఈశాన్యం ఆగమనం

Shaik Mohammad Shaffee
17 అక్టోబర్, 2025

భారతదేశ వాతావరణంలో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. దేశానికి నాలుగు నెలల పాటు విస్తారమైన వర్షాలను అందించిన నైరుతి రుతుపవనాలు ఒకరోజు ఆలస్యంగా గురువారం దేశం నలుమూలల నుంచి పూర్తిగా నిష్క్రమించినట్లు భారత వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో దక్షిణ భారతదేశంలో తూర్పు తీర ప్రాంతాలకు వర్షాలను ఇచ్చే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ వెల్లడించింది.

నైరుతి రుతుపవనాల ఉపసంహరణ వాయువ్య భారతం నుంచి సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభమై దశలవారీగా కొనసాగుతూ వచ్చింది. సాధారణంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 15 నాటికి దేశం నుంచి రుతుపవనాలు పూర్తిగా వైదొలగాల్సి ఉంటుంది. ఈ ఏడాది కేవలం ఒక రోజు ఆలస్యంగా అంటే అక్టోబరు 16 గురువారం నాడు తిరోగమనం పూర్తయింది. ఈ రుతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే మెరుగైన వర్షపాతం నమోదై, వ్యవసాయానికి, జలవనరులకు ఎంతో ప్రయోజనం చేకూరింది.

ఈ ఏడాది రుతుపవన ప్రయాణం

ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల కాలం అనేక రికార్డులను నమోదు చేసింది. సాధారణంగా జూన్ 1న కేరళను తాకాల్సిన రుతుపవనాలు, ఈ ఏడాది మే 24నే కేరళలోకి ప్రవేశించాయి. 2009లో మే 23న రాగా, ఆ తర్వాత ఇంత ముందుగా రావడం ఇదే తొలిసారి. జూలై 8 నాటికి దేశమంతటా విస్తరించాల్సిన రుతుపవనాలు, ఈసారి ఏకంగా తొమ్మిది రోజుల ముందుగానే అంటే జూన్ 29 నాటికే దేశమంతటినీ చుట్టుముట్టాయి. 2020లో జూన్ 26న విస్తరించగా, ఆ తర్వాత ఇది అత్యంత వేగవంతమైన విస్తరణగా నమోదైంది.

వర్షపాతం వివరాలు

సెప్టెంబర్ 30తో ముగిసిన నాలుగు నెలల రుతుపవన కాలంలో దేశంలో 8 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. సాధారణంగా 868.6 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, ఈ ఏడాది 937.2 మి.మీ. వర్షపాతం రికార్డైంది. జూన్‌లో 8.9 శాతం, జూలైలో 4.8 శాతం, ఆగస్టులో 5.2 శాతం, సెప్టెంబర్ లో 15.3 శాతం చొప్పున సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో సగటున 13 అల్పపీడన వ్యవస్థలకు బదులుగా, 18 అల్పపీడన వ్యవస్థలు, 69 అల్పపీడన దినాలు (సగటు 55) నమోదవడం అధిక వర్షపాతానికి కారణమని ఐఎండీ పేర్కొంది.

అధిక వర్షాల ప్రభావం, నష్టాలు

వాయువ్య భారతం ఈ సీజన్‌లో అత్యధిక వర్షపాతం నమోదు చేసింది. జూన్, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఆ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. దీని కారణంగా పంజాబ్‌లో దశాబ్దాల తరబడి ఎప్పుడూ చూడని వరదలు సంభవించి, వేలాది హెక్టార్ల వ్యవసాయ భూములు మునిగిపోయాయి, లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. హిమాలయ రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్‌లు, ఆకస్మిక వరదలు సంభవించి కొండచరియలు విరిగిపడ్డాయి, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. అయితే, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడుతూ, వాయువ్య ప్రాంతంలో అదనపు వర్షపాతానికి తరచూ సంభవించిన పశ్చిమ వాయుగుండాలే కారణమని తెలిపారు.

సాధారణంగా రుతుపవన కాలంలో సగటున 13 అల్పపీడన వ్యవస్థలు, 55 అల్పపీడన దినాలు నమోదవుతుంటాయి. అయితే 2025 రుతుపవన సీజన్‌లో ఏకంగా 18 అల్పపీడన వ్యవస్థలు, 69 అల్పపీడన దినాలు నమోదయ్యాయి. ఈ చురుకైన వ్యవస్థల వల్లే దేశంలో విస్తారంగా వర్షాలు కురిశాయి.

ఈశాన్య రుతుపవనాల ఆగమనం

నైరుతి రుతుపవనాల తిరోగమనం పూర్తవడంతో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, కర్ణాటక దక్షిణ భాగం, కేరళ-మాహె ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర అంచనా ప్రకారం, జూన్-సెప్టెంబర్‌లో సమృద్ధిగా వర్షాలు కురిసిన తర్వాత, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉండే పోస్ట్-మాన్‌సూన్ సీజన్‌లో కూడా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్టోబర్ నెలలో సాధారణం కంటే 15 శాతం అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో వార్షిక వర్షపాతంలో అధిక భాగం ఈ సీజన్‌లోనే నమోదవుతుంది. ఈ సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, తుఫానుల కారణంగా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

రైతన్నలకు ఊరట

నైరుతి రుతుపవనాల చివరి దశ వర్షాలు, ఆ తర్వాత ప్రారంభమయ్యే ఈశాన్య రుతుపవనాలు... ఖరీఫ్ పంటల కోత సమయానికి, రబీ పంటల సాగుకు అవసరమైన తేమను, నీటిని అందించి రైతులకు ఊరటనిస్తాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో వర్షపాతం వివరాలను తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు. దేశంలో ఇక నుంచి ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణం క్రమంగా చల్లబడడం మొదలవుతుంది. రుతుపవనాలు దేశ వ్యవసాయ రంగానికి (జీడీపీలో 18.2 శాతం, 42 శాతం జనాభాకు జీవనాధారం), జలాశయాల నిల్వలకు, విద్యుత్ ఉత్పత్తికి అత్యంత కీలకం. ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాలు దేశ ఆర్థిక వ్యవస్థకు, రైతులకు మేలు చేస్తాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

నైరుతి నిష్క్రమణ.. ఈశాన్యం ఆగమనం - Tholi Paluku