


నైజీరియాలో గురి తప్పిన వైమానిక దాడి.. 100 మందికి పైగా మృతి!
నైజీరియాలో పెను విషాదం చోటుచేసుకుంది. ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో ఆ దేశ వైమానిక దళం చేసిన భారీ తప్పిదం వందలాది కుటుంబాల్లో చీకట్లు నింపింది. ఈశాన్య నైజీరియాలోని యోబ్ రాష్ట్రంలో ఉన్న జిలి గ్రామ మార్కెట్పై శనివారం వైమానిక దళం జరిపిన దాడుల్లో 100 మందికి పైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. జిహాదీ తిరుగుబాటుదారులే లక్ష్యంగా జరిపిన ఈ ‘మిస్ఫైర్’ దాడిలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఏం జరిగిందంటే?
నైజీరియా-బోర్నో సరిహద్దు సమీపంలోని జిలి గ్రామంలో శనివారం జనం రద్దీగా ఉన్న సమయంలో నాలుగు యుద్ధ విమానాలు ఒక్కసారిగా బాంబుల వర్షం కురిపించాయి. ఉగ్రవాదులు మార్కెట్కు వస్తున్నారనే సమాచారంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఉగ్రవాదులకు బదులుగా ఆ బాంబులు సాధారణ ప్రజలు, వ్యాపారుల మీద పడ్డాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా నివేదిక ప్రకారం.. ఈ దాడిలో కనీసం 56 మంది అక్కడికక్కడే మరణించగా, 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, స్థానిక నేతల లెక్కలు మరింత గందరగోళంగా ఉన్నాయి.
మృతుల సంఖ్యపై భిన్నాభిప్రాయాలు
ఈ దారుణ ఘటనలో అసలు ఎంత మంది ప్రాణాలు కోల్పోయారనే విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు. మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం 100 మందికి పైగా చనిపోగా, మరో 35 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అయితే స్థానిక నేత లావాన్ జన్నా నూర్ మాట్లాడుతూ.. మృతులు, గాయపడిన వారి సంఖ్య కలిపి సుమారు 200 వరకు ఉంటుందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరో ఎనిమిది మంది చనిపోయారని పేర్కొన్నారు. మరోవైపు మార్కెట్ కమిటీ సభ్యుడు బులామా ములిమా అబ్బాస్ మాత్రం తాము నేరుగా 36 మృతదేహాలను లెక్కించామని చెబుతున్నారు.
సైన్యం వివరణ.. విచారణకు ఆదేశం
ప్రారంభంలో ఈ దాడిని సమర్థించుకున్న సైన్యం, తాము ఉగ్రవాద స్థావరాన్ని విజయవంతంగా ధ్వంసం చేశామని, భారీగా ముష్కరులు హతమయ్యారని పేర్కొంది. అయితే పౌరుల మృతిపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో వైమానిక దళం స్వరం మార్చింది. జిలి మార్కెట్పై పొరపాటున దాడి జరిగి ఉండవచ్చని అంగీకరిస్తూ, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది.
పునరావృతమవుతున్న ‘పొరపాట్లు’
నైజీరియా సైన్యం ఇలాంటి ఘోర తప్పిదాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా ఉగ్రవాదుల వేటలో సామాన్య పౌరులు బలవుతూనే ఉన్నారు. 2017 జనవరిలో ఒక శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో ఏకంగా 112 మంది మరణించగా, 2023 డిసెంబర్లో కడునా రాష్ట్రంలో జరిగిన ఒక మతపరమైన వేడుకను తప్పుగా అంచనా వేసి బాంబులు వేయడంతో 85 మంది ప్రాణాలు కోల్పోయారు. 2025 జనవరిలోనూ జంఫారా రాష్ట్రంలో జరిగిన మరో పొరపాటు దాడిలో 16 మంది మరణించారు. ఇలా వరుసగా జరుగుతున్న దాడులు ఆ దేశ రక్షణ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతున్నాయి.
అంతర్జాతీయ పర్యవేక్షణ - అమెరికా మద్దతు
నైజీరియాలో పెచ్చుమీరుతున్న జిహాదీ హింసపై అంతర్జాతీయ సమాజం నిఘా పెంచింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఉగ్రవాదుల ఏరివేతకు శిక్షణ ఇచ్చేందుకు అమెరికా ఇప్పటికే 200 మంది సైనికులను నైజీరియాకు పంపింది. మరోవైపు ఉగ్రవాద కేసుల్లో నైజీరియా ప్రభుత్వం వేగంగా వ్యవహరిస్తోంది. సుమారు 508 కేసులను విచారించి, 386 మందిని దోషులుగా నిర్ధారించినట్లు ఆ దేశ న్యాయశాఖ మంత్రి లతీఫ్ ఫగ్బెమి తెలిపారు. ఈ చర్యను అమెరికా సీనియర్ సలహాదారు మసాద్ బౌలోస్ ప్రశంసించారు. జిహాదీ గ్రూపులైన బోకో హరామ్, ఐఎస్డబ్ల్యూఏపీ దాడులతో నలిగిపోతున్న నైజీరియాకు, సొంత సైన్యం చేస్తున్న ఇటువంటి పొరపాట్లు ఇప్పుడు పెను సవాలుగా మారాయి.
