
నేపాల్ ఎన్నికలకు పిలుపు - ప్రజాస్వామ్య పునరుద్ధరణకు మలుపు
నేపాల్ మళ్లీ రాజకీయ మార్పు అంచున నిలిచింది.నిరంతరం అస్థిరతకు అలవాటుపడిన హిమాలయ దేశం మరోసారి ప్రభుత్వ పతనాన్ని చూసింది. కూటమి ప్రభుత్వ పతనంతో నేపాల్ మళ్లీ అనిశ్చితి దశలోకి ప్రవేశించింది. కానీ ఈ రాజకీయ మబ్బుల మధ్య ఒక ఆశాకిరణం వెలుగుతోంది తాత్కాలిక ప్రధానమంత్రి సుశీలా కార్కీ పౌరులందరినీ, ముఖ్యంగా యువతను, ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని చేసిన పిలుపు. ఇది కేవలం పరిపాలనా ప్రకటన కాదు, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పిలుపు.
తాజా ప్రభుత్వ పతనం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. సంవత్సరాలుగా కొనసాగుతున్న రాజకీయ విభజనలు, అస్థిర కూటములు, సిద్ధాంతాల కంటే అధికార సమీకరణాలపై ఆధారపడిన వ్యవస్థ, పాలనను శూన్యంగా మార్చాయి. కొత్త గణతంత్రాన్ని వాగ్దానం చేసిన పార్టీలే గుంపులుగా విడిపోయి, పదవుల కోసం పరస్పరం తగువులు పెట్టుకుంటున్నాయి. వనరుల పంపకం, నియామకాలు, రాజ్యాంగ వివరణ వంటి అంశాలపై అంతర్గత విభేదాలే ప్రభుత్వాన్ని కూల్చాయి. పార్లమెంట్ మరోసారి రద్దయింది. ప్రజల నమ్మకం మరింత క్షీణించింది.
దశాబ్దాల పోరాటం తర్వాత తిరిగి సాధించిన ప్రజాస్వామ్యం ఇప్పుడు ఆశయం , అలసట మధ్య చిక్కుకుంది. 2015 రాజ్యాంగం తర్వాత రెండు జాతీయ ఎన్నికలు జరిగినా, పలు ప్రధానమంత్రులు మారినా, పాలనలో స్థిరత్వం రాలేదు. విభిన్న వర్గాల సమాజంలో కూటమి రాజకీయాలు సహజమైనప్పటికీ, అవి భావాల కంటే నంబర్ల ఆటగా మారిపోయాయి. తరచూ కూలిపోతున్న ప్రభుత్వాలు, అవినీతి ఆరోపణలు ప్రజల్లో విసుగు పెంచాయి. ప్రజాస్వామ్యం నిజంగా స్థిరత్వం, గౌరవం ఇస్తుందా అనే సందేహం పెరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే సుశీలా కార్కీ పిలుపు విశేష ప్రాధాన్యత పొందింది. నవంబర్ 16లోపు ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేయబోయే యువతను. తాత్కాలిక ప్రభుత్వం అయినప్పటికీ, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి ప్రజాస్వామ్య పునరుద్ధరణకు నాంది పలకాలని ఈ ప్రయత్నం కనిపిస్తోంది.
ప్రతీకాత్మకంగా కూడా ఇది గొప్ప చర్య. పార్లమెంట్లలో రాజకీయ నాయకులు తమ తమ సొంత అజెండాల వలయంలో చిక్కుకున్న ఈ సమయంలో, ఓటరు జాబితా ప్రక్రియ ప్రజాస్వామ్యం మూలం ఎక్కడుందో గుర్తు చేస్తుంది అది సభల్లో కాదు, ఓటు కేంద్రాల్లో. ఎన్నికల కమిషన్ నివేదికల ప్రకారం యువత, మహిళలు, వికలాంగులు కూడా ముందుకొచ్చి నమోదు అవుతున్నారు. రాజకీయ నాయకులు విభజితమైనా ప్రజలు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. అదే ప్రజాస్వామ్యానికి ప్రాణం.
కానీ కేవలం ఓటరు నమోదుతో ప్రజాస్వామ్యం రక్షించబడదు. సంస్థల పట్ల గౌరవం, విభిన్నాభిప్రాయాల పట్ల సహనం, పరిపాలనలో పారదర్శకత ఇవే ప్రజాస్వామ్య సంస్కృతి యొక్క అసలు పునాది. ప్రతి కొద్ది నెలలకు ప్రభుత్వం పడిపోతే, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఒప్పందం కాకుండా నంబర్ల ఆటగా మారుతుంది. తాత్కాలిక లాభాల కోసం పార్లమెంటరీ విధానాన్ని భ్రష్టు పట్టించే ప్రవర్తన మారాలి. దేశ నిర్మాణం కోసం దీర్ఘకాల దృష్టి అవసరం.
ఇటీవలి సంక్షోభం వ్యవస్థాపక లోపాలనూ బహిర్గతం చేసింది. నేపాల్ ఫెడరల్ వ్యవస్థ ఇప్పటికీ అసంపూర్ణంగా ఉంది. అధికార వికేంద్రీకరణ జరిగి కూడా ఆర్థిక స్వయం సమీకరణ స్పష్టంగా లేదు. ఖాట్మాండు కేంద్రిత అధికార యంత్రాంగం స్థానిక పాలనకు అనుగుణంగా మారడంలో ఇబ్బంది పడుతోంది. అవినీతి విచారణలు నిలిచిపోవడం, యువత విదేశాలకు వలస పోవడం ఇవన్నీ ప్రజల్లో నిరాశ పెంచుతున్నాయి. ప్రజాస్వామ్యం ఉపాధి, న్యాయం, స్థిరత్వం ఇవ్వలేకపోతే నిస్పృహ మొదలవుతుంది; అదే ప్రజాస్వామ్య పతనానికి తొలి సంకేతం.
తాత్కాలిక ప్రభుత్వం ఇప్పుడు రెండు కీలక బాధ్యతలు చేపట్టాలి రోజు వారీ పాలన కొనసాగించడం, అలాగే విశ్వసనీయ ఎన్నికలకు పునాది వేయడం. ఎన్నికల కమిషన్ పారదర్శకమైన, సమగ్ర ప్రక్రియకు కట్టుబడి ఉంది. పౌర సమాజం, మీడియా, అంతర్జాతీయ భాగస్వాములు కూడా ప్రజల స్వరాన్ని ముందుంచే బాధ్యత వహించాలి. పొరుగు దేశాలు భారతదేశం, చైనా కూడా స్థిరమైన ప్రజాస్వామ్య నేపాల్ ప్రాంతీయ ప్రయోజనంలోనే ఉందని గుర్తించాలి.
ఇప్పటికీ ఆశ బతికే ఉంది. రాజరికం నుండి గణతంత్రానికి ఎదిగిన నేపాల్లో ప్రజాస్వామ్య మూలాలు బలంగా ఉన్నాయి. ప్రగతిశీల రాజ్యాంగం, మహిళలకు, మైనార్టీలకు విస్తృత హక్కులు కల్పించడం, ఉత్సాహవంతమైన పౌర సమాజం, స్వేచ్ఛా పత్రికా రంగం ఇవన్నీ దాని బలాలు. పలు విఫల ప్రభుత్వాల తర్వాత కూడా ప్రజలు ఓటు పట్ల విశ్వాసం కోల్పోలేదు. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన శ్వాస.
రాబోయే నెలలు ఈ స్థిరత్వాన్ని పరీక్షించబోతున్నాయి. ఎన్నికల ప్రచారం మొదలైనప్పుడు ప్రధాన ప్రశ్న ఎవరు గెలుస్తారని కాదు, నేపాల్ పరిపాలనా వ్యవస్థను తీర్చిదిద్దగలదా అనే. రాజకీయ పార్టీలు వ్యక్తిపరమైన పోటీలు దాటి సూత్రపరమైన నాయకత్వం వైపు తిరగాలి. డిజిటల్ అవగాహన కలిగిన యువత తాము వీక్షకులుగా కాకుండా భవిష్యత్తు రూపకర్తలుగా భావించాలి.
ప్రధానమంత్రి కార్కీ నాయకత్వం తాత్కాలికమైనదైనా, అది నిరాశ మరియు ఆశ మధ్య ఒక నైతిక వంతెన కావచ్చు. ఓటు వయస్సు పరిమితిని 16 సంవత్సరాలకు తగ్గించడం యువజన ఉద్యమాలకు ప్రేరణగా మారింది. ప్రజాస్వామ్యం వారసత్వం కాదు, ప్రతి తరం కొత్తగా నిర్మించాల్సినదే అనే నమ్మకానికి ఇది నిదర్శనం. ఈ ప్రయత్నం సఫలమైతే, 2026 ఎన్నికలు కేవలం అధికార మార్పు కాకుండా ప్రజాస్వామ్య నమ్మక పునరుద్ధరణగా నిలుస్తాయి.
ఈ రోజు నేపాల్ కీలక మలుపులో ఉంది సున్నితమైన, నిరాశతో నిండిన, అయినా అవకాశాలతో ఉప్పొంగిన దశలో ప్రభుత్వ పతనం ప్రజాస్వామ్య ముగింపు కాదు, దాని పునర్జన్మకు హెచ్చరిక. ఓటరు జాబితా కార్యక్రమం ఆ పునర్జన్మకు తొలి అడుగు. రాజ్యం నుండి గణతంత్రం, అస్తవ్యస్తత నుండి ఆత్మవిశ్వాసం వైపు సాగిన దేశానికి ఇప్పుడు అవసరం ఐక్యత, సహనం, ధైర్యం.
రాబోయే ఎన్నికలు స్థిరత్వం, బాధ్యత, ప్రజా నమ్మకం తీసుకురాగలిగితే, నవ ప్రజాస్వామ్యాలు కూడా, హిమాలయ శిఖరాలంత ఎత్తుకు ఎదగగలవని నేపాల్ ప్రపంచానికి మరోసారి నిరూపిస్తుంది.
