
నేపాల్లో మళ్లీ జెన్-జడ్ ఆందోళనలు.. కర్ఫ్యూ విధింపు, 10 మందికి గాయాలు!
నేపాల్లో మళ్లీ జెన్-జెడ్ ఆందోళనలు చెలరేగాయి. నేపాల్లోని దక్షిణ ప్రాంత జిల్లా అయిన బారాలో గురువారం మళ్లీ జెన్-జెడ్ యువకులు, పదవి నుంచి తొలగించబడిన ప్రధాని కేపీ శర్మ ఓలీ పార్టీ మద్దతుదారుల (సీపీఎన్-యూఎంఎల్) మధ్య ఘర్షణలు చెలరేగడంతో కనీసం 10 మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు ఆ ప్రాంతంలో తిరిగి కర్ఫ్యూ విధించారు.
బుధవారం జరిగిన ఘర్షణలకు సంబంధించి తమ ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులను అరెస్టు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ జెన్-జెడ్ యువకులు వీధుల్లోకి తిరిగి రావడంతో బారా జిల్లాలోని సిమరా చౌక్లో ఉద్రిక్తత పెరిగింది. దీంతో స్థానిక యంత్రాంగం ఉదయం 1 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు (స్థానిక సమయం) కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ, నిరసనకారులు వీధుల్లోకి వచ్చి పోలీసులతో ఘర్షణకు దిగారు. నిరసనకారులు కర్ఫ్యూను ధిక్కరించి ముందుకు రావడంతో అధికారులు ఆరు రౌండ్ల భాష్ప వాయు గోళాలు, రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఘర్షణల్లో ఆరుగురు పోలీసులు, నలుగురు 'జనరేషన్ జెడ్' నిరసనకారులకు గాయాలైనట్లు సమాచారం.
ప్రస్తుతం నిరసనకారులు సిమరా బజార్లోని ఒక పోలీస్ బీట్కు నిప్పంటించారు. అంతేకాకుండా, అంతకుముందు జరిగిన ఘర్షణల్లో పాలుపంచుకున్న సీపీఎన్-యూఎంఎల్ కార్యకర్తలను అరెస్టు చేయడంలో పోలీసులు వెనుకాడారని ఆరోపిస్తూ, యూఎంఎల్ పార్టీ కార్యాలయం నుంచి వస్తువులను బయటకు తీసి వాటిని కూడా తగలబెట్టారు.
ఘర్షణకు మూలం
ఈ జిల్లాలో ఘర్షణలు మొదట బుధవారం రోజున ప్రారంభమయ్యాయి. సీపీఎన్-యూఎంఎల్ జనరల్ సెక్రటరీ శంకర్ పోఖరెల్, పార్టీ యువ నాయకుడు మహేష్ బస్నెట్ ప్రభుత్వంపై ర్యాలీ నిర్వహించడానికి ఖాట్మండు నుండి సిమరాకు బయలుదేరారనే వార్త జెన్-జెడ్ సభ్యులకు తెలియడంతో వారు విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. వారి రాకను వ్యతిరేకిస్తూ స్థానిక యూఎంఎల్ కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. అప్పుడు పరిస్థితి అదుపు తప్పడంతో విమానాశ్రయం చుట్టుపక్కల కర్ఫ్యూ విధించారు. దాంతో యూఎంఎల్ నాయకులు ర్యాలీని రద్దు చేసుకున్నారు. బుధవారం నాటి ఘర్షణలకు సంబంధించి 'జనరేషన్ జెడ్' యువకులను కొట్టిన ఆరోపణలపై పోలీసులు ఇద్దరు యూఎంఎల్ కార్యకర్తలను (వార్డు చైర్పర్సన్లు ధన్ బహదూర్ శ్రేష్ఠ, కైమొద్దీన్ అన్సారీ) అరెస్టు చేశారు.
ఓలీ డిమాండ్లు
గత సెప్టెంబర్ 12న రద్దు చేయబడిన ప్రతినిధుల సభను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పదవీచ్యుతుడైన ఓలీకి చెందిన సీపీఎన్-యూఎంఎల్ పార్టీ నేపాల్ అంతటా నిరసనలు నిర్వహిస్తోంది. గతేడాది సెప్టెంబర్ 9న జరిగిన అవినీతి వ్యతిరేక నిరసనలలో నిరసనకారులపై సామూహిక హత్యలు జరిగాయని, దీనిపై విచారణ జరిపించాలని 'జనరేషన్ జెడ్' కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
