
నేడు సికింద్రాబాద్లో ‘ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్’ ముగింపు వేడుకలు
గత నెల రోజులుగా హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో అత్యంత ఉత్సాహంగా సాగిన 'ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్' క్రీడలు దిగ్విజయంగా ముగిశాయి. ఈ మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్లో భాగంగా 39 మైదానాల్లో నిర్వహించిన పోటీల్లో సుమారు 33,378 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడం, ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ నిర్వహించబడిందని పేర్కొన్నారు.
ఈ క్రీడా సంబరాల ముగింపు వేడుక, బహుమతుల ప్రదాన కార్యక్రమం ఫిబ్రవరి 21న (నేడు) సికింద్రాబాద్లోని జిమ్ఖానా గ్రౌండ్స్లో ఘనంగా జరగనుంది.ఉదయం 8 గంటలకు ఫైనల్ మ్యాచ్లు ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం 3 గంటలకు విజేతలకు బహుమతుల ప్రదానం జరుగుతుంది. క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపిన ఈ వేడుకకు క్రీడాభిమానులందరూ తరలిరావాలని కిషన్ రెడ్డి ఆహ్వానించారు.
