Let's talk: editor@tmv.in
నేడు క్వాంటం వ్యాలీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

నేడు క్వాంటం వ్యాలీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

Panthagani Anusha
7 ఫిబ్రవరి, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అమరావతిని ప్రపంచ క్వాంటం పరిశోధనలకు కేంద్ర బిందువుగా మారుస్తూ, నేడు ‘అమరావతి క్వాంటం వ్యాలీకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అత్యాధునిక ఆవిష్కరణలు, లోతైన పారిశ్రామిక సహకారం ప్రతిభావంతులైన యువతను తయారు చేయడంలో దేశానికే దిక్సూచిగా నిలవనుంది.

అగ్రనేతల సమక్షంలో వేడుక

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు దేశ విదేశాలకు చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారు. భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో సాధించబోయే అద్భుత ప్రయాణంలో అమరావతి ఒక నిర్వచించదగిన మైలురాయిగా నిలిచిపోతుందని ప్రభుత్వం ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేసింది. కేవలం నిర్మాణానికే పరిమితం కాకుండా ఈ వేడుకలో భాగంగా అంతర్జాతీయ సంస్థలతో పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.

మరోవైపు ఈ ప్రాజెక్టులో భాగంగా ఐటీ దిగ్గజాలు ఐబిఎం, టీసీఎస్ సంస్థల సహకారంతో క్వాంటం క్లౌడ్ సేవలను ప్రారంభించనున్నారు. అదేవిధంగా అమరావతి క్వాంటం వ్యాలీ లోగోను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. వీటితో పాటు ఐబిఎం-టీసీఎస్ క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్,క్వాంటం టాలెంట్ హబ్ అదేవిధంగా ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ని నెలకొల్పబోతున్నారు.

భవిష్యత్తు తరాలకు రక్షణ.. ఉపాధి

ప్రస్తుత సమాచార భద్రతలో కీలకమైన ‘క్వాంటం-సేఫ్’ అప్లికేషన్‌ను ప్రారంభించనుంది. కాగా దాదాపు తొమ్మిది ప్రముఖ కంపెనీలు ఈ పర్యావరణ వ్యవస్థలో భాగస్వాములుగా చేరడం ప్రైవేట్ రంగంలో రాష్ట్రం పట్ల ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. జాతీయ శాస్త్ర సాంకేతిక ప్రాధాన్యతలకు అనుగుణంగా తరువాతి తరం సాంకేతిక పరిజ్ఞానాలలో భారతదేశ నాయకత్వానికి అమరావతి అర్థవంతమైన సహకారాన్ని అందిస్తుందని, ఈ చొరవ ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని ప్రపంచ పటంలో మరింత బలోపేతం చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

నేడు క్వాంటం వ్యాలీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన - Tholi Paluku