
నేటి నుంచి రిపబ్లిక్ డే పరేడ్–2026 టికెట్ల విక్రయం
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి గణతంత్ర దినోత్సవ పరేడ్, బీటింగ్ రిట్రీట్ ఫుల్ డ్రస్ రిహార్సల్, బీటింగ్ రిట్రీట్ ప్రధాన కార్యక్రమం టికెట్ల విక్రయం జనవరి 5 నుంచి ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. టికెట్ల విక్రయం జనవరి 14, 2026 వరకు కొనసాగుతుందని, ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి కేటాయించిన కోటా పూర్తయ్యే వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
టికెట్ ధరలు ఇలా
గణతంత్ర దినోత్సవ పరేడ్ (జనవరి 26), రూ.20–100, బీటింగ్ రిట్రీట్ ఫుల్ డ్రస్ రిహార్సల్ (జనవరి 28) రూ.20, బీటింగ్ రిట్రీట్ ప్రధాన కార్యక్రమం (జనవరి 29)రూ.100 గా పేర్కోంది.
ఆన్లైన్లో టికెట్లు
టికెట్లు Aamantran పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఆఫ్లైన్ లో ఢిల్లీలోని ఎంపిక చేసిన కౌంటర్లలో ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు చూపించి టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్ లేదా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు చెల్లుబాటు అవుతాయి. మూడు కార్యక్రమాలకూ అదే గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది.
ఆఫ్లైన్ లో
ఆఫ్లైన్ కౌంటర్లు జనవరి 5 నుంచి 14 వరకు, ఉదయం 10 గంటల నుంచి 1 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు పనిచేస్తాయి. టికెట్ల కౌంటర్లు ఉన్న ప్రదేశాలు: సేనా భవన్ (గేట్ నం.5 సమీపంలో), శాస్త్రి భవన్ (గేట్ నం.3 సమీపంలో), జంతర్ మంతర్ (ప్రధాన ద్వారం), పార్లమెంట్ హౌస్ (రిసెప్షన్), రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ (డి బ్లాక్), కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26, 2026న ఘనంగా జరుపుకోనుంది. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు, సాయుధ దళాల పరేడ్, రక్షణ సామర్థ్యాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వేలాది మంది ప్రత్యక్షంగా, కోట్లాది మంది ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఈ వేడుకలను వీక్షిస్తారని అంచనా. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
