
నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5.17 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఒంటిపూట బడుల నిబంధనల ప్రకారం, పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 వరకు పనిచేస్తాయని ఇప్పటికే స్పష్టం చేశారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్షల సమయంలో ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుండి 12:30 వరకు సీసీ కెమెరాల నిఘాలో జరుగుతాయి. అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలి, 5 నిమిషాల ఆలస్యమైనా అనుమతి ఉండదు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని అధికారులు కోరారు.
పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలియజేశారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా, నేర్చుకున్న అంశాలను ప్రదర్శించే ఒక చక్కని అవకాశంగా చూడాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
విద్యార్థులు తమపై తాము నమ్మకం ఉంచుకుని, ప్రశాంతమైన మనసుతో సమయపాలన పాటిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ ప్రయాణంలో విద్యార్థులకు అండగా నిలుస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్రను ఆయన అభినందించారు. విద్యార్థులందరూ విద్యాపరంగా విజయం సాధించాలని ఆయన ఆశీర్వదించారు.
