
నెహ్రూ రచనలు దేశ మనస్సాక్షికి ప్రతిబింబం: రాహుల్ గాంధీ
భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాసిన రచనలు కేవలం గతాన్ని చెప్పే చరిత్ర మాత్రమే కాదని, అవి భారత ప్రజాస్వామ్య ఆలోచన (భావజాలం) కాలక్రమేణా ఎలా అభివృద్ధి చెందిందో, ఎదిగిందో చూపించే దేశ "మనస్సాక్షి"కి ప్రతిబింబమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. నెహ్రూ రాసిన "సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ" రచనల డిజిటలైజేషన్ పూర్తయిన సందర్భంగా రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీనిని స్వాగతించారు. నిజాలు నిజాలే… వాటిని ఎవ్వరూ మార్చలేరని పేర్కొన్నారు. “పండిట్ నెహ్రూ, ఆయన సాధించిన గొప్ప విజయాల గురించి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ప్రచారం అవుతున్న ఈ రోజుల్లో, భవిష్యత్ తరాలకు నిజం తెలియడానికి ఆయన రచనలను డిజిటలైజ్ చేయడం చాలా అవసరం” అని ఎక్స్లో పేర్కొన్నారు. “‘ద నెహ్రూ ఆర్కైవ్’ ఇప్పుడు లైవ్లో ఉంది. ఇది జవహర్లాల్ నెహ్రూ రచనల మొదటి సమగ్ర ఓపెన్-యాక్సెస్ డిజిటల్ ఆర్కైవ్. ఇవి అందరికీ సులభంగా వినియోగించుకునేలా ఉచితంగా అందుబాటులో ఉన్నాయి” అని ఖర్గే చెప్పారు.
రాహుల్ గాంధీ కూడా ఎక్స్లో పోస్ట్ చేస్తూ, భారతదేశ ప్రజాస్వామ్య ప్రయాణాన్ని, దాని ధైర్యాన్ని, ఆశలను అర్థం చేసుకోవాలనుకునే ఎవరికైనా నెహ్రూ రచనలు శక్తివంతమైన దిక్సూచిలాగా పనిచేస్తాయని పేర్కొన్నారు. “ఈ వారసత్వం ఇప్పుడు అందరికీ ఓపెన్, సెర్చ్ చేయగలిగే విధంగా, ఉచితంగా అందుబాటులో ఉండటం ఆనందకరం” అని రాహుల్ లింక్ను పంచుకున్నారు.
జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ (జేఎన్ఎంఎఫ్) ఈ డిజిటలైజేషన్ పనులను పూర్తి చేసింది. రెండవ దశలో నెహ్రూకు రాసిన ఉత్తరాలను కూడా ఈ ఆర్కైవ్లో చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని జేఎన్ఎంఎఫ్ ట్రస్టీ అయిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ తెలిపారు. గాంధీ, పటేల్, అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి అప్పటి ముఖ్య నాయకుల ఆర్కైవ్లను కూడా నెహ్రూ ఆర్కైవ్తో అనుసంధానం చేయాలని ఆయన సూచించారు.
జేఎన్ఎంఎఫ్ ఒక ప్రకటనలో, నవంబర్ 14, 2024న ఇచ్చిన హామీ ప్రకారం, నెహ్రూ సెలెక్టెడ్ వర్క్స్ మొత్తం ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ ఆర్కైవ్ను ఇప్పుడు ప్రజలందరూ nehruarchive.in వెబ్సైట్ ద్వారా ఉచితంగా, సులభంగా యాక్సెస్ చేయవచ్చు. మొత్తం 100 వాల్యూమ్లలో ఉన్న సుమారు 35,000 డాక్యుమెంట్లు, 3,000 బొమ్మలు డిజిటలైజ్ చేయబడ్డాయి. ఈ ఆన్లైన్ వెర్షన్ 1920ల నుంచి 1960ల వరకు భారత చరిత్రను, నెహ్రూ పాత్రను అధ్యయనం చేయాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. 1958 తర్వాత ఉన్న హిందీ ప్రసంగాలు, వాటి ఆంగ్ల అనువాదాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లలో ఆయన ఉత్తరాలు, ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలు, డైరీ ఎంట్రీలు, ఫైళ్లపై రాసిన నోటింగ్స్, చివరకు ఆయన గీసిన డూడుల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ సెర్చ్ చేయగలిగే విధంగా, ఉచితంగా డౌన్లోడ్ చేసుకునేలా ఉన్నాయి. వీటిని మొబైల్, ల్యాప్టాప్ రెండింటిలోనూ సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ప్రింటెడ్ వెర్షన్ ఫాక్సిమిలీలు కూడా డిజిటల్ టెక్స్ట్తో పాటు అందుబాటులో ఉన్నాయి. జైరాం రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 77,000 పేజీలు, 35,000 ఆర్టిఫాక్ట్స్ను 61 ఏళ్ల కాలపు రికార్డుల నుంచి సేకరించి ఈ డిజిటల్ ఆర్కైవ్ రూపొందించారు.
