
నిలంబూర్లో పర్యటించిన ప్రియాంక వాద్రా
కేరళలోని మలప్పురం జిల్లాలోని నిలంబూర్లో ఉన్న ఆసియాలోనే అత్యంత పురాతన టేకు తోట కొన్నోలిని వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి విశేషాలను ‘ఎక్స్’లో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నిలంబూర్ టేకు అన్నది వయనాడ్ ప్రజలకు ‘దేవుడిచ్చిన ఓ ప్రకృతి బహుమతి’ అని కొనియాడారు. ఈ టేకుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో విలువ ఉందని, ఇక్కడ తయారైన వీటి ఉత్పత్తులను బంకింగ్ హమ్ ప్యాలెస్, రోల్స్ రాయిస్ కార్లలో తదితర ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారని వివరించారు. అలాగే ఇక్కడి ఉత్పత్తులను ప్రతివారం ప్రజలు వేలం వేస్తారన్నారు. కొన్నోలీ ప్లాంటేషన్ ఆసియాలోనే అత్యంత పురాతనమైనదన్నారు. టేకును ఎలా ఉత్పత్తి చేస్తారు. ఎలా అమ్ముతారన్నా వివరాలను అధికారులు ఆమెకు వివరించారు. ఈ విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయన్నారు.
చెట్టియాలతూర్లో పర్యటన
వయనాడ్ పర్యటనలో భాగంగా ప్రియాంక వాద్రా చెట్టియాలతూర్ గ్రామంలో పర్యటించారు. అక్కడ ప్రజలతో సమావేశమయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, అధికారులకు తెలిపారు. తదుపరి సమావేశంలోపు పురోగతి సాధించాలని సూచించారు. అలాగే కోజికోడ్ లోని మనస్సేరి లో శ్రీకునాథ్ మహావిష్ణు ఆలయాన్ని సందర్శించారు. అక్కడి వాతావరణం మనసుకు హత్తుకునేలా ఉందని, అక్కడి పరిసరాలు ప్రశాంతత, ఆధ్యాత్మికతతో నిండి ఉన్నాయని తెలిపారు. చాలా మంది భక్తులు అక్కడికి వచ్చారు. వారిని కలవడం నాకు చాలా సంతోషానిచ్చింది. అలాగే ఆలయ గోడలపై ఉన్న చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి. శిల్పాలు అపురూపంగా చెక్కారు. ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిందేనని అన్నారు.
