Let's talk: editor@tmv.in
నిర్మల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరాలి: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరాలి: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Gaddamidi Naveen
21 జనవరి, 2026

నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిర్మల్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీజేపీ శాసనసభా పక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నిర్మల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేసే లక్ష్యంతో ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సుపరిపాలన కార్యక్రమాలు, ప్రజాహిత నిర్ణయాలు, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి, పారదర్శక పాలన, దేశ భద్రత, ఆర్థిక సంస్కరణల వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. అదే సమయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టాలని, స్థానిక సమస్యలపై బీజేపీ స్పష్టమైన కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.

మున్సిపల్ ఎన్నికలు పార్టీకి కీలకమని పేర్కొన్న ఆయన, ప్రతి వార్డులో బలమైన సంస్థాగత నిర్మాణం ఉండాలని, బూత్ స్థాయి నుంచి కార్యకర్తల సమన్వయం అవసరమని చెప్పారు. యువత, మహిళలు, వ్యాపారులు, కార్మికులు వంటి అన్ని వర్గాలతో ప్రత్యక్ష సంప్రదింపులు పెంచాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై ప్రజలకు నమ్మకం కలిగేలా నిరంతర ప్రచారం జరగాలన్నారు.

ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల ప్రభారి బస్వ లక్ష్మీ నర్సయ్య, జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, జిల్లా మున్సిపల్ ఎన్నికల కన్వీనర్, జిల్లా, పట్టణ స్థాయి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశం విజయవంతంగా సాగగా, ఎన్నికలకు సమాయత్తం కావాలని నేతలు పిలుపునిచ్చారు.