
నితీశ్కుమార్ పీఎంగా రిటైర్ అవుతారనుకున్నా: అఖిలేష్ యాదవ్
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2026 రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేయడంపై సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శలు చేశారు. తాను నితీశ్ కుమార్ ప్రధానమంత్రి పదవిలో నుంచి రిటైర్ అవుతారని భావించానని, కానీ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా రిటైర్ అవుతారని వ్యాఖ్యానించారు. శనివారం మీడియాతో మాట్లాడిన అఖిలేష్ యాదవ్, రాజకీయాలను అర్థం చేసుకునే వారికి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ముందే తెలిసిపోయిందన్నారు. నితీశ్ కుమార్ ప్రధానమంత్రిగా రిటైర్ కావాలని తాము ఆశించామని, అయితే ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల ముందు నితీశ్ కుమార్ ఎన్డీఏ కూటమిలో తిరిగి చేరే ముందు ప్రతిపక్షాల ఇండియా బ్లాక్ స్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు. ఆయనను కొందరు ప్రతిపక్ష నేతలు ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా భావించారు.
ఇదిలా ఉండగా బీహార్ మంత్రి శ్రావణ్కుమార్ మాట్లాడుతూ నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లే నిర్ణయంపై పార్టీ కార్యకర్తలు కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ, ఆయన నిర్ణయానికి మద్దతుగా నిలబడాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ నిర్ణయం పూర్తిగా నితీశ్ కుమార్ రాజకీయ నిర్ణయమని ఆయన వివరించారు. ఆయన ఇప్పటికే విధానసభ, విధాన పరిషత్, లోక్సభల్లో పనిచేశారని, ఇప్పుడు రాజ్యసభ మాత్రమే మిగిలి ఉండటంతో అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. అలాగే నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ త్వరలో పార్టీ రాజకీయాల్లోకి రావడాన్ని కూడా శ్రవణ్ కుమార్ స్వాగతించారు. జేడీయూ పార్టీ ప్రకారం నిశాంత్ కుమార్ ఆదివారం అధికారికంగా పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
