Let's talk: editor@tmv.in
నాసిక్‌లో విషాదం..కారు బావిలో పడి 9 మంది మృతి

నాసిక్‌లో విషాదం..కారు బావిలో పడి 9 మంది మృతి

Pinjari Chand
5 ఏప్రిల్, 2026

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందారు. కారుతో పాటు వారు బావిలో పడిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఘటన శుక్రవారం రాత్రి దిండోరి పట్టణంలోని శివాజీ నగర్ ప్రాంతంలో జరిగింది. విందు కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కారును నడుపుతున్న సునీల్ దత్తు దార్గుడే అదుపు కోల్పోవడంతో వాహనం రోడ్డుపక్కనున్న బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో సునీల్ దార్గుడే (32), అతని భార్య రేష్మా, ఆశా అనిల్ దార్గుడే (32)తో పాటు కుటుంబానికి చెందిన ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు బాలికలు (7–14 ఏళ్ల మధ్య వయస్సు), 11 ఏళ్ల బాలుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రెండు క్రేన్లు, ఈతగాళ్ల సహాయంతో అర్ధరాత్రి వరకు కష్టపడి కారును బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను దిండోరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

బావులపై భద్రతా తనిఖీలు నిర్వహించాలి

ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నారుల మృతి అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజా రాకపోకలు ఉన్న ప్రాంతాల్లో ఉన్న బావులపై వెంటనే భద్రతా తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బావికి తక్కువ ఎత్తులో గోడ ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సరైన రక్షణ గోడ ఉంటే ప్రమాదాన్ని నివారించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇక రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రి గిరీశ్‌ మహజన్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. బావిని వెంటనే మూసివేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుందని ప్రకటించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు దర్యాప్తు నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి చెప్పారు. ఈ విషాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది హృదయ విదారక సంఘటన అని పేర్కొన్నారు.