Let's talk: editor@tmv.in
నాన్న జైలులో క్షేమంగా ఉన్నారో లేదో తెలియడం లేదు: ఇమ్రాన్ ఖాన్ కుమారులు

నాన్న జైలులో క్షేమంగా ఉన్నారో లేదో తెలియడం లేదు: ఇమ్రాన్ ఖాన్ కుమారులు

Shaik Mohammad Shaffee
2 డిసెంబర్, 2025

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన క్షేమంపై, ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి సరైన సమాచారం లేకపోవడంతో ఆయన కుమారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు తమకు ఏదో పెద్ద విషయాన్ని దాచిపెడుతున్నారేమోనని వారు భయపడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ కుమారులలో ఒకరైన ఖాసిం ఖాన్ 'రాయిటర్స్' వార్తా సంస్థతో మాట్లాడుతూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు. గత మూడు వారాలకు పైగా తమ తండ్రి బతికే ఉన్నారనే దానికి ఎటువంటి ఆధారం లభించడం లేదని ఆయన చెప్పారు.

కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, జైలు అధికారులు తమను ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు అనుమతించడం లేదని, కనీసం విశ్వసనీయమైన సమాచారం కూడా ఇవ్వడం లేదని ఖాసిం ఖాన్ ఆవేదన చెందారు. "మా నాన్న సురక్షితంగా ఉన్నారా, గాయపడ్డారా, లేదా బతికే ఉన్నారా అనే విషయం తెలియకపోవడం ఒక రకమైన మానసిక హింస" అని ఆయన పేర్కొన్నారు. మాకు తెలియకుండా ఏదో పెద్ద విషయాన్ని దాచిపెడుతున్నారేమోనని మాకు చాలా భయంగా ఉంది" అని ఖాసిం అన్నారు. ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత వైద్యుడిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కుటుంబం పదేపదే కోరుతున్నప్పటికీ, గత ఒక సంవత్సరం నుండి దానికి అనుమతి లభించడం లేదని తెలిపారు.

‘ఇమ్రాన్ ఖాన్‌ను ఒంటరి చేస్తున్నారు’

ఖాసిం ఖాన్, ఆయన సోదరుడు సులేమాన్ ఇసా ఖాన్ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. తమ తండ్రిని ఉద్దేశపూర్వకంగా ప్రజల దృష్టికి రాకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపించారు. టీవీ ఛానళ్లకు ఇమ్రాన్ ఖాన్ పేరు లేదా చిత్రాన్ని ఉపయోగించవద్దని ఆదేశించారని, జైలుకు వెళ్ళినప్పటి నుండి ఆయన కేవలం ఒక అస్పష్టమైన కోర్టు చిత్రం మాత్రమే బయట కనిపించిందని తెలిపారు. "ఈ ఏకాంతం ఉద్దేశపూర్వకంగా చేసింది. ఆయనకు భయపడుతున్నారు. ఆయన పాకిస్తాన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు, ప్రజాస్వామ్యబద్ధంగా ఆయనను ఓడించలేమని వారికి తెలుసు" అని ఖాసిం ఖాన్ అధికారులపై ఆరోపణలు చేశారు. నవంబర్ 2022లో తన తండ్రిపై హత్యాయత్నం జరిగిన తర్వాత చివరిసారిగా చూశానని, ఆ జ్ఞాపకం తమను వెంటాడుతోందని ఖాసిం తెలిపారు.

అంతర్జాతీయంగా అప్పీల్

ఇమ్రాన్ ఖాన్ క్షేమం కోసం తాము అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలను ఆశ్రయిస్తున్నామని ఖాసిం ఖాన్ చెప్పారు. కోర్టు ఆదేశాల ప్రకారం తమకు వెంటనే కలిసే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. "ఇది కేవలం రాజకీయ వివాదం మాత్రమే కాదు, ఇది మానవ హక్కుల అత్యవసర పరిస్థితి. అన్ని వైపుల నుండి ఒత్తిడి రావాలి. ఆయన క్షేమంగా ఉన్నారని మాకు తెలియాలి" అని ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. అయితే ఈ విషయంపై పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించలేదు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక జైలు అధికారి మాత్రం, ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని, వేరే జైలుకు తరలించే ప్రణాళిక ఏదీ లేదని రాయిటర్స్‌కు తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్‌పై ఉన్న కేసులు

72 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుండి జైలులో ఉన్నారు. 2022లో అధికారం కోల్పోయిన తర్వాత తనపై వచ్చిన కేసులన్నీ రాజకీయ కుట్రలని ఆయన అంటున్నారు. అధికారంలో ఉండగా తనకు అందిన బహుమతులను అక్రమంగా అమ్ముకున్నారనే 'తోషఖానా కేసులో ఆయనకు మొదట శిక్ష పడింది. ఒక రహస్య దౌత్య కేబుల్‌ను లీక్ చేశారనే ఆరోపణలపై 10 సంవత్సరాలు, భూ ఒప్పందాలకు సంబంధించిన అల్-ఖదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో 14 సంవత్సరాలు సహా పలు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. అయితే ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మాత్రం ఈ కేసులన్నీ ఇమ్రాన్ ఖాన్‌ను రాజకీయాల నుండి దూరం చేయడానికి చేసిన ప్రయత్నాలని వాదిస్తోంది.

నాన్న జైలులో క్షేమంగా ఉన్నారో లేదో తెలియడం లేదు: ఇమ్రాన్ ఖాన్ కుమారులు - Tholi Paluku