Let's talk: editor@tmv.in
నానల్ నగర్‌లో ట్రాఫిక్ అవగాహన సదస్సు.. ఉచిత హెల్మెట్ల పంపిణీ

నానల్ నగర్‌లో ట్రాఫిక్ అవగాహన సదస్సు.. ఉచిత హెల్మెట్ల పంపిణీ

Gaddamidi Naveen
3 మార్చి, 2026

నగరంలోని నానల్ నగర్‌‌లో ట్రాఫిక్ అవగాహన సదస్సు, ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. గోల్కొండ జోన్ పరిధిలోని కుల్సుంపురా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రహదారి భద్రతా నియమాల పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందించడం, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యంగా అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి అదనపు డీసీపీ (ట్రాఫిక్, గోల్కొండ జోన్) సి. వేణుగోపాల్ రెడ్డి, ఏసీపీ డి. ధనలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు రహదారి భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రజలను కోరారు. ద్విచక్ర వాహనదారులు, పిలియన్ రైడర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనీ, నాలుగేళ్లకు పైబడిన పిల్లలు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనీ సూచించారు. అన్ని మోటార్ వాహనాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించాల్సిన అవసరాన్ని వివరించారు.

అదేవిధంగా ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్ చేయకూడదని, లేన్ క్రమశిక్షణ పాటించాలని, భారీ వాహనాలు నిర్ణయించిన వేగ పరిమితులను కచ్చితంగా అనుసరించాలని అధికారులు హెచ్చరించారు. కార్యక్రమంలో భాగంగా హెచ్‌సీఎస్‌సీ టీమ్, యంగ్ ఇండియా టీమ్ సమన్వయంతో సుమారు 15 హెల్మెట్లు అర్హులైన వాహనదారులకు ఉచితంగా పంపిణీ చేశారు. టోలిచౌకి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జి. వెంకటేశ్వర్లు, కుల్సుంపురా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం. రాజేంద్ర ప్రసాద్‌తో పాటు ఇతర సిబ్బంది హాజరయ్యారు. ట్రాఫిక్ పోలీసులు రహదారి భద్రత కోసం కట్టుదిట్టమైన అమలు చర్యలు, అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొంటూ, ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.

నానల్ నగర్‌లో ట్రాఫిక్ అవగాహన సదస్సు.. ఉచిత హెల్మెట్ల పంపిణీ - Tholi Paluku