
నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ నాంపల్లిలోని శనివారం మధ్యాహ్నం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నాలుగు అంతస్తుల ఫర్నిచర్ దుకాణం గ్రౌండ్ ఫ్లోర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఫైర్ సర్వీసులు, పోలీస్ శాఖ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఇతర శాఖలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆటో డ్రైవర్ ఒకరు, భవన వాచ్మన్, అతని భార్య, ఇద్దరు పిల్లలు సహా మొత్తం ఆరుగురు భవనం లోపల చిక్కుకుని ఉండవచ్చని మజ్లిస్ ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ తెలిపారు.
భవనం మొత్తం దట్టమైన పొగతో నిండిపోవడంతో రెస్క్యూ సిబ్బందికి సహాయక చర్యలు చేపట్టడం కష్టతరంగా మారింది. పరిస్థితి తీవ్రతను గమనించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ సంఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అగ్నిప్రమాదాన్ని అదుపులోకి తీసుకువచ్చినప్పటికీ, భవనం అంతటా దట్టమైన పొగ వ్యాపించడంతో లోపలికి వెళ్లడం సిబ్బందికి కష్టంగా మారింది అని ఆయన తెలిపారు.
బాధితులు రెండో సెల్లార్లో చిక్కుకుని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ, అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. పొగ తీవ్రత కారణంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఫైర్ సిబ్బంది వెనక్కి రావాల్సి వచ్చిందని సజ్జనార్ తెలిపారు. నాంపల్లి ప్రాంతంలో అనేక ఫర్నిచర్ షాపులు ఉండటంతో ఈ ఘటనకు సంబంధించి మరింత జాగ్రత్తగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అగ్నిప్రమాదంపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భవనం లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని విధాలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, పరిస్థితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి సూచించినట్లు అధికారిక ప్రకటన వెల్లడించింది.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ అగ్నిప్రమాదంపై స్పందించారు. సహాయక చర్యలపై అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, రెస్క్యూ ఆపరేషన్కు సహకరించాలని తన పార్టీ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్కు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
