
నవీ ముంబై విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన పీఎం మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం రూ.19,650 కోట్ల వ్యయంతో నిర్మించిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించారు. 1,160 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ కొత్త విమానాశ్రయం భారతదేశం యొక్క విమానయాన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనుంది. ముంబైలోని ఇప్పటికే ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉన్న భారీ ట్రాఫిక్ భారాన్ని తగ్గించనుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టు, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) మోడల్ కింద అభివృద్ధి చేశారు.
ఇది ముంబై మెట్రోపాలిటన్ రీజియన్కు రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం. ముంబై మెట్రో లైన్-3లోని 2బీ దశను కూడా ప్రారంభించారు. ఇది ఆచార్య అత్రే చౌక్ నుంచి కఫ్ పరేడ్ వరకు విస్తరించి రూ.12,200 కోట్ల వ్యయంతో నిర్మించారు. మొత్తం రూ.37,270 కోట్ల ముంబై మెట్రో లైన్ 3 (ఆక్వా లైన్)ను మోడీ దేశానికి అంకితం చేశారు. ముంబై వన్ యాప్ను కూడా మోడీ ప్రారంభించారు. ఇది ప్రయాణికులకు బహుళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లలో ఇంటిగ్రేటెడ్ మొబైల్ టికెటింగ్ వంటి వివిధ ప్రయోజనాలను అందిస్తుంది.
మహారాష్ట్రలోని స్కిల్, ఎంప్లాయ్మెంట్,ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ యొక్క షార్ట్-టర్మ్ ఎంప్లాయబిలిటీ ప్రోగ్రామ్ (స్టెప్) కార్యక్రమాన్ని కూడా మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం 400 ప్రభుత్వ ఐటీఐలు, 150 ప్రభుత్వ టెక్నికల్ హైస్కూళ్లలో అమలు చేస్తున్నారు. ఇది ఉపాధి సామర్థ్యాన్ని పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ను పరిశ్రమ అవసరాలతో సమన్వయం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.
